పేదరికంలో మగ్గుతున్న దళితుల జీవితాల్లో దళితబంధు కొత్త వెలుగులు నింపింది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నవారికి కొండంత అండగా నిలిచింది. గతంలో వివక్ష, వెనుకబాటు తనానికి గురైన కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించాయి. సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,705 యూనిట్లు మంజూరు చేయించారు. ఇందుకుగానూ మొత్తం రూ.2,705 కోట్లను విడుదల చేశారు. చారకొండ మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. దీంతో ఒక్కో యూనిట్కు రూ.10 లక్షలను ప్రోత్సాహకంగా అందజేశారు. దీంతో పలు రంగాల్లో వ్యాపారాలు మొదలుపెట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. కూలీలుగా ఉన్న వారు వాహనాలు అందుకొని యజమానులుగా మారారు. గతంలో అవమానాలు ఎదుర్కొన్న దళితులు నేడు గౌరవంగా.. ఉన్నత స్థానంలో జీవిస్తున్నారు. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ కాలరెగరేసి చెబుతున్నది. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం దళితబంధు సాయం అందిస్తుంటే సీమాంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తే ఓ దిన పత్రికకు ఇవేమీ కనిపించడం లేదు. బాగుపడుతున్న దళితులపై ఇంకా వివక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నది. బతుకు దెరువుచూపించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు
చెబుతున్నా.. ఇంకా అబద్ధపు వార్తలతో విషం కక్కుతున్న సదరు పత్రికా యాజమాన్యం తీరు ఇప్పటికైనా మార్చుకోవాల్సి ఉన్నది.
మహబూబ్నగర్, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాటలకే పరిమితమైన షెడ్యూల్డ్ కులాల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వం చేతల్లో చేసి చూపిందింది. ఉమ్మడి రాష్ట్రంలో కాగితాలకే పరిమితమైన దళితుల జీవితాల్లో సీఎం కేసీఆర్ సర్కార్ వెలుగులు నింపింది. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటునందించింది. ఒక్కో లబ్ధిదారుడికీ రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం చేసి ఆత్మగౌరవాన్ని చాటింది. కూలీలుగానూ, ఆటోడ్రైవర్లుగా మున్సిపాలిటీ పంచాయతీలో నాలుగో తరగతి సిబ్బందిగా చూసిన దళితులను తెలంగాణ ఏర్పడ్డాక వారి బతుకులను మార్చింది. మిగితా కులాల మాదిరిగానే స్వయం సమృద్ధి సాధించాలని దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2705 దళితబంధు యూనిట్లను మంజూరు చేసింది. ట్రాన్స్పోర్టు సర్వీస్ సెక్టార్లో వారికి నచ్చిన విధంగా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు రూ.10లక్షల చొప్పున విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని సుమారు రూ.2705కోట్లను విడుదల చేసింది. అచ్చంపేట నియోజకవర్గం లో చారకొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి ఆ మండలంలోని 1407 దళిత కుటుంబాలకు ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వం అందించిన సాయంతో ఆరునెలలుగా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. వారి కుటుంబాలను పోషించుకొని పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో ఎనిమిది మంది కుటుంబాలకు కలిపి రూ.80లక్షలతో ఒకేచోట వ్యాపారం చేసుకునేలా సహకారం అందించారు. దీంతో ప్రతిరోజూ రూ.30వేల నుంచి రూ.50వేల వరకు సంపాదిస్తున్నారంటే దళితబంధు పథకం ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. త్వరలో రెండో విడుతలో భాగంగా నియోజకవర్గానికి 500యూనిట్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో సీమాంధ్ర అడుగులకు మడుగులొత్తే ఓ దినపత్రిక దళితబంధు మీద విషం కక్కుతూ వార్తలు ప్రచురించింది. దళితబంధు యూనిటే ఇందుకు సాక్షమని ‘నమస్తే తెలంగాణ’ కాలరేగరేసి చెబుతున్నది. ఈ స్కీం కింద లబ్ధిదారులను కదలిస్తే ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తున్నారు. కేసీఆర్ నిజంగా దేవుడిలా మారి మాకు దారి చూపాడని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనంద భాష్ఫాలు రాలుస్తున్నారు.
మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబగద్వాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు కింద ఏడాది కిందట ఒక్క నియోజకవర్గానికి 100యూనిట్ల చొప్పున మంజూరు చేసింది. మహబూబ్నగర్ జిల్లాలో 316 యూనిట్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 1807యూనిట్లు, వనపర్తి జిల్లాలో 200యూనిట్లు, నారాయణపేట జిల్లాలో 183యూనిట్లు, జోగుళాంబగద్వాల జిల్లాలో 199యూనిట్లు చొప్పున కేటాయించారు. దీంతో ఆయా జిల్లాలో అర్హులైన దళిత కుటుంబాలకు సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఎంపిక చేసిన వారికి కావాల్సిన వ్యాపారాలను దగ్గరుండి పెట్టించారు. డ్రైవింగ్లో ప్రావీణ్యం ఉన్నవారు సొంత వాహనంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. మరికొందరు డెయిరీ ఫాం, వస్త్రదుకాణాలు, టెంట్హౌస్లు, సిమెంట్ దుకాణాలు, హార్డ్వేర్ షాపులు, జనరల్స్టోర్స్, కిరాణా దుకాణాలు, హోల్సెల్ డీలర్షిప్లు ఏర్పాటు చేసుకొని వందలమందికి తమ దుకాణాల్లో ఉపాధి కల్పిస్తున్నారు. దళిత కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని చారకొండ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గం స్కీం వర్తింపజేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఐదు మండలాలను రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసింది. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విజ్ఞప్తి మేరకు చారకొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేర్చింది. దీంతో ఈ మండలంలోని మొత్తం దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించింది. కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, మండల అధికారులతో సమీక్షలు జరిపి మండలంలో ఎన్ని కుటుంబాలున్నాయో సర్వే నిర్వహించారు. మొత్తం 1407కుటుంబాలను గుర్తించి దళితబంధు పథకానికి ఎంపిక చేసి యూనిట్లు అందజేశారు. పాలకేంద్రాలు, గొర్రెల పెంపకం, వ్యవసాయం సంబంధిత వాటికి ప్రాధాన్యమిచ్చారు. అదేవిధంగా మరికొంత మంది వాహనాలు కొనుగోలు చేశారు. వీరందరికీ అధికారులు దగ్గరుండి నచ్చిన వ్యాపారులు చేసేందుకు సహకారం అందిస్తున్నారు.
నా భర్త రెండేండ్ల కిందట గుండెపోటుతో మరణించాడు. అప్పటినుంచి కూలీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాను. నాకు నలుగురు కూతుర్లు, కొడుకు ఉన్నాడు. ఓ కూతురు తొమ్మిదో తరగతి, మరొకరు ఏడో తరగతి, నాలుగో తరగతి, రెండో తరగతి, కొడుకు ఒకటో తరగతి చదువుతున్నాడు. కూలీ పని చేసి పిల్లలను చదివించి జీవితం సాగించడం చాలా కష్టంగా మారింది. సీఎం కేసీఆర్ సారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో వస్త్ర దుకాణం పెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాను. నా జీవితంలో ‘దళితబంధు’ వెలుగులు నింపింది. నా కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– పద్మ, కొండేరు, ఇటిక్యాల, జోగుళాంబ గద్వాల జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో పేద దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. వ్యవసాయ కూలీలుగా, కారు డ్రైవర్లుగా, వస్త్రదుకాణాల్లో, హోటళ్లలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వారు ఊహించని విధంగా ఓనర్లయ్యారు. పెట్టుబడిసాయం కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. దళారులే రాజ్యమేలి నిజమైన పేదలకు అందకుండా చేశారు. దళితబంధు పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపికచేసి అర్హులైన పేదలకు దళితబంధు అందడంతో వారంతా సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రతి వ్యాపారకేంద్రంలో సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకోవడం ఇందుకు నిదర్శనం. కలలో కూడా తాము ఊహించలేదని తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయని లబ్ధిదారులు అంటున్నారు. జీవితాంతం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు.