మిర్చి పంట అంటే రైతులకు ఎంతో మమ‘కారం’. అందుకే సాగుకు కర్షకులు ఆసక్తి చూపుతారు. మిర్చీకి కేరాఫ్గా జోగుళాంబ గద్వాల నిలుస్తున్నది. ఈ ఏడాది కూడా జిల్లాలో 38,105 ఎకరాల్లో పంట సాగైంది. అయితే ఈసారి మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. రోజురోజుకూ ఎర్రబంగారం ధరలు పైపైకి చేరుతున్నాయి. క్వింటాకు రూ.22 వేల నుంచి రూ.35 వేల వరకు పలుకుతున్నది. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తున్నది. సిరుల పంటకు తోడు మద్దతు ధర లభిస్తుండడంతో మిరప రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
– గద్వాల, జనవరి 20
గద్వాల, జనవరి 20: ప్రజలకు మిర్చి కంట్లో నీరు తెప్పిస్తుండగా.. రైతన్నకు మాత్రం లాభాలు కురిపిస్తున్నది. ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో మిర్చి అంతర్భాగమైనది. ప్రతి కూరలో కారం తప్పనిసరి.. కారం లేని కూర తినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే ఈ ఏడాది రైతులు సాగుచేసిన మిరపపంటకు తామర, రసంపీల్చే పురుగు సోకడంతో దిగుబడి తగ్గినా.. ప్రస్తుతం మార్కెట్లో రైతుకు లభిస్తున్న ధరలు సంతోషాన్నిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా నల్లరేగడి భూములు ఉండడంతో రైతులు మిర్చి పంటను సాగుచేస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో రైతులు నామమాత్రంగా మిరపసాగు చేస్తున్నారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఈ ప్రాంత రైతులు ఎక్కువగా మిరపతోపాటు పత్తి సాగుచేస్తున్నారు.
ఈ రెండు పంటలు సాగుచేసిన రైతులకు వానకాలం సీజన్ కలిసొచ్చింది. రైతులు వానకాలంలో సాగుచేసిన పంట ప్రస్తుతం చేతికి రావడంతో మార్కెట్లో మిర్చికి మంచి ధర పలుకుతున్నది. జిల్లాలో రైతులు ఎక్కువగా గుంటూరు రకం, బేడిగ తదితర మిర్చి పంటను సాగు చేశారు. మిరప సరాసరి ఎకరాకు 20క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. అయితే ఈ ఏడాది దిగుబడి 15క్వింటాళ్లకు పడి పోయింది. రైతు ఎకరాకు సుమారు రూ.80వేల దాకా ఖర్చు చేస్తున్నారు. మిరపపంట సాగుచేసిన రైతుకు పెట్టుబడి పోనూ సరాసరి సగం లాభాలు వస్తుండడంతో రైతులు మిరపపంటపై ఆసక్తి చూపుతున్నారు. 2021లో జిల్లాలో 35,088ఎకరాల్లో రైతులు మిరపసాగు చేయగా ఈ ఏడాది 38,105ఎకరాల్లో సాగు చేశారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులను వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సూచిస్తుండడంతో రైతులు ఆ దిశగా సాగు చేస్తున్నారు. రైతులు ఇక్కడ పండించిన మిరపను ఎక్కువగా గుంటూరు, రాయచూర్ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు.
ఈ ఏడాది మిరపసాగు చేసిన రైతులకు గుంటూరు రకానికి క్వింటాకు రూ.22వేలు ఉండగా బేడిగ బెస్ట్ రకం మిరపకు రూ.35వేల వరకు మార్కెట్లో రైతుకు ధర లభిస్తున్నది. మామూలు కారం మిరప ధరలు రూ.18వేల వరకు మార్కెట్లో ధర లభిస్తున్నది. జిల్లాలో ఇటిక్యాలలో 8,244 ఎకరాలు, మానవపాడులో 4,989, ఉండవెళ్లిలో 3,298, అయిజలో 3,951, మల్దకల్లో 3,348, గద్వాలలో 4,621, గట్టు 3,624, రాజోళి 1,924, వడ్డేపల్లిలో 1,033, కేటీదొడ్డి 1,308, ధరూర్ 466, అలంపూరులో 1,299ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. జిల్లాలో రైతులకు అవసరమైన నీటి వనరులు ఉండడంతో రైతులు పత్తి, మిర్చిసాగువైపు మక్కువ చూపుతున్నారు.
ధర బాగుంది.. దిగుబడి తగ్గింది
నేను ఎనిమిదెకరాల్లో గుంటూరు రకానికి చెందిన మిరపపంట సాగుచేశాను. గతేడాది ఎకరాకు 20క్వింటాళ్లపైగా దిగుబడి వచ్చింది. ఈ ఏడాది పంటకు తెగులు సోకడంతో పెట్టుబడి పెరిగింది. దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గినా పెట్టుబడి పెరిగినా ధరలు బాగుండడంతో రైతులకు ఎలాంటి నష్టం లేదు. ప్రతిసారీ మిరపపంట సాగు చేస్తాం. రైతులకు మిరప ఎప్పటికీ లాభాల పంటనే.
– సుధాకర్, మిర్చి రైతు, మానవపాడు
దిగుబడి వస్తే బాగుండేది..
దిగుబడి ఎక్కవ వస్తే బాగుండేది. ప్రస్తుతం మిర్చిపంట ఆశించినస్థాయిలో లేదు. గతేడాది ఎకరాకు 20నుంచి 25క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఎకరాకు 12నుంచి 15క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మార్కెట్లో మిర్చి ధర ఎక్కువగా ఉంది. నేను నాలుగెకరాల్లో మిర్చి సాగు చేశాను. మంచి దిగుబడి ఉంది. రైతులు ఆశించిన స్థాయిలో లాభాలు ఉన్నాయి.
– రఫీ, మిర్చి రైతు, మునగాల
మిర్చితో అధిక లాభాలు
మిర్చి పంటతో రైతులకు అధిక లాభాలు వస్తున్నాయి. నేను మూడెకరాల్లో మిర్చిపంట సాగుచేశాను. ఎకరాకు 10 నుంచి 15క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో మిర్చి ధర రూ.23వేల నుంచి రూ.26వేల వరకు ధర పలుకుతుంది. దీంతో మంచి లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్ధతు ధర కల్పిస్తే రాష్ట్రంలోని మిర్చి రైతులకు ఎలాంటి నష్టాలు రావు. దీంతో మిర్చి రైతు కూడా లాభల్లో ఉంటారు.
– సీతారాంనాయుడు, మిర్చి రైతు, తిమ్మాపూర్