మక్తల్ రూరల్, నవంబర్ 25 : బ్యాంక్ అధికారుల నిర్వాహకంతో దళారులు, పైరవీకారులు కలిసి రైతుల పేరుమీద నకిలీ పాస్పుస్తకాలు సృష్టించడంతోపాటు రైతులకు తెలియకుండా రుణాలు తీసుకుని స్వాహా చేశారు. ఊట్కూర్ ఎస్బీఐలో అడాప్షన్ లేకున్నా వేరే మండలాల రైతుల పేరు మీద కూడా లోన్లు తీసుకున్నారు. ఇలా ఎందరో రైతుల పేరుమీద దాదాపు రూ.2 కోట్లకు పైగా చేతులు మారినట్లు తెలుస్తున్నది. ఊట్కూర్ ఎస్బీఐ కేంద్రంగా జరిగిన అక్రమాలకు అభం శుభం తెలియని రైతులు బలవుతున్నారు. బ్యాంక్ అధికారులు రుణాల రికవరీ కోసం వెళ్లగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూమి లేని రైతుల పేరు మీద కూడా రుణాలు ఇవ్వడం గమనార్హం.
అసలు కథ ఇదీ..!
2017లో మక్తల్ మండలంలోని మంథన్గోడ్ గ్రామానికి చెందిన దాదాపు 22 మంది రైతుల పేరు మీద ఊట్కూర్ ఎస్బీఐలో పైరవీకారులు క్రాప్లోన్లు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఊట్కూర్ ఎస్బీఐ అధికారులు తమ బ్రాంచ్లో రుణాలు తీసుకున్న రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి విచారించారు. కొందరు రుణాలు రెన్యూవల్ చేశామని, మరికొందరు రుణాలు తీసుకోలేదని చెప్పారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. లోన్లు బకాయి ఉన్నట్లు ఖాతాలో చూపిస్తున్నదని అధికారులు చెప్పారు. బ్యాంక్ అధికారులు, పైరవీకారుల కుమ్మక్కులో మోసపోయిన బాధితుల వివరాలు..
ముక్తాంబీ పేరు మీద భూమి లేకున్నా ఊట్కూర్ ఎస్బీఐలో పైరవీకారులు రూ.80 వేలు క్రాప్లోన్ తీసుకున్నారు.
నకిలీ పట్టాదారు పాస్ పుస్తకంలో మౌలాలి ఫొటో పెట్టి ఊట్కూర్ ఎస్బీఐలో రూ.లక్ష లోన్ తీసుకున్నారు.వాకిటి లక్ష్మి ఎస్బీహెచ్ మక్తల్ బ్రాంచ్లో రూ.25 వేలు క్రాప్లోన్ తీసుకున్నది. మూడేండ్లుగా క్రమం తప్పకుండా లోన్ రెన్యూవల్ చేస్తున్నది. కాగా, ఊట్కూర్ ఎస్బీఐ బ్యాంక్ అధికారులు తమ వద్ద రూ.లక్ష లోన్ తీసుకున్నదని, లోన్ కట్టాలని లక్ష్మి ఇంటి వద్దకు వెళ్లి విచారించారు. తీసుకోని అప్పు ఎలా కట్టాలని నిలదీయడంతో అధికారి చేసేదేమీ లేక వెనుదిరిగారు.
మంతన్గోడ్ గ్రామానికి చెందిన దర్మమ్మ మక్తల్ ఎస్బీఐలో రూ.85 వేలు లోన్ తీసుకున్నది. వారం కిందట లోన్ రెన్యువల్ కోసం దర్మమ్మ కుమారుడు నరేందర్ మక్తల్ ఎస్బీఐకి వెళ్తే ఊట్కూర్ బ్రాంచ్లో లోన్ ఉందని అధికారులు తెలిపారు. అక్కడికి వెళ్లగా మూడేండ్ల కిందట రూ.85 వేల లోన్ వేరే వ్యక్తి ఖాతాలో ట్రాన్స్ఫర్ చేసినట్లు ఉందని చెప్పారు. ఇప్పుడు దర్శమ్మ పేరు మీద రూ.1.70 లక్షల లోన్ ఉందని ఊట్కూర్ బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
దాసరి లింగప్ప పేరు మీద భూమి లేకున్నా రూ.లక్ష రుణం తీసుకున్నారు. కాగా, రికవరీ కోసం వెళ్లిన ఫీల్డ్ ఆఫీసర్ చనిపోయిన దాసరి లింగప్ప కుమారుడు తాయప్పను విచారించారు. భూమి లేనప్పుడు లోన్ ఎలా ఇచ్చారని తాయప్ప నిలదీశాడు.
మరో విచిత్రం ఏమిటంటే.. ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పేరిట కూడా నకిలీ పాస్పుస్తకం సృష్టించి రూ.96 వేలు లోన్ తీసుకున్నారు. బ్యాంక్ అధికారుల ప్రమేయంతో దళారులు పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసినట్లు తెలుస్తున్నది.
మక్తల్ కేంద్రంగా లావాదేవీలు..
ఊట్కూర్ ఎస్బీఐ బ్యాంక్లో 2017లో పనిచేసిన ఇద్దరు మేనేజర్లు, ఒక క్లర్కు పైరవీకారులతో చేతులు కలిపి ఈ అక్రమ క్రాప్లోన్ల బాగోతం నడిపినట్లు తెలిసింది. మక్తల్లో అద్దెకు ఉండి ఊట్కూర్ ఎస్బీఐలో పలువురు బినామీ రైతుల పేరుతో కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారు. మక్తల్ మండలంలోని మంథన్గోడ్, ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్ల, తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన రైతుల పేరు మీద నకిలీ పాసుపుస్తకాలు సృష్టించి డబ్బు కాజేశారు. ఈ అక్రమ రుణాల బాగోతంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఎంతమంది బాధిత రైతులు ఉన్నారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
సెలవుపై వెళ్లిన బ్యాంక్ మేనేజర్..?
రుణాల బాగోతం వెలుగు చూడడంతో ఊట్కూర్ ఎస్బీఐ మేనేజర్ సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. రికవరీకి వెళ్లిన అధికారులను రుణా లు తీసుకోలేదని రైతులు నిలదీస్తుండడంతో.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుందని భావించి సెలవుపై వెళ్లినట్లు సమాచారం.
ఏడాది కిందట ఉద్యోగుల సస్పెన్షన్?
ఊట్కూర్ ఎస్బీఐలో పంట రుణాల మంజూరులో అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులను ఏడాది కిందటే సస్పెన్షన్ చేసినట్లు బ్యాంక్ వర్గాల ద్వారా తెలిసింది. 2017-18 సంవత్సరానికి గానూ సరైన ధ్రువపత్రాలు లేకుండానే రుణాలు మంజూరు చేశారు. అయితే, 2019-20లో అప్పటి బ్యాంక్ మేనేజర్ బదిలీ కావడంతో.. కొత్తగా వచ్చిన అధికారి రుణాల లావాదేవీలపై ప్రాథమికంగా విచారణ చేశారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించి అప్పట్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అడాప్షన్ లేకున్నా ఇతర గ్రామాలకు సంబంధించి రైతులకు రుణాలు మంజూరు చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు అధికారులు అంతర్గత విచారణ జరిపి బాధ్యులైన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే, మూడు నెలల కిందట బదిలీపై వచ్చిన కొత్త మేనేజర్ విజయ్కుమార్ రుణాల రికవరీ కోసం సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.