శ్రీరంగాపూర్, డిసెంబర్ 1 : పల్లెలు బాగుంటేనే దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాడు గ్రామాల్లో తాగునీటి కోసం తండ్లాట ఉండేదని, నేడు మిషన్ భగీరథతో మంచినీరు పుష్కలంగా సరఫరా అవుతున్నదని చెప్పారు. మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో బుధవారం పల్లెనిద్ర చేపట్టిన మంత్రి నిరంజన్రెడ్డి గురువారం ఉదయం గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి రాకతో గ్రామాల నుంచి వలసలు పూర్తిగా తగ్గాయన్నారు. గతంలో వెళ్లిన కుటుంబాలు సైతం సొంతూళ్లకు తిరిగి వస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో వ్యవసాయం పండుగలా సాగుతున్నదని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడంతో బీడు భూములు పంట పొలాలతో సస్యశ్యామలంగా దర్శనమిస్తున్నాయని వివరించారు. ధాన్యరాశులతో పల్లెలు కళకళలాడుతున్నాయని చెప్పారు.
మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలకు పునర్జీవం ఏర్పడిందన్నారు. పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలనే మార్చిందని వివరించారు. నాడు కంపునకు కేరాఫ్గా ఉండగా.. నేడు పరిశుభ్రతకు ఆనవాళ్లుగా సుందరంగా మారాయన్నారు. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, జీపీలకు ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్తో కొత్త శోభ వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు.
నాగసానిపల్లిలో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించేదుదకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారికి తక్షణ ఆర్థికసాయం చేసి ప్రతి నెలా అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేలా చూస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకలస్వామి, ఎంపీపీ గాయత్రి, రైతుబంధు మండల అధ్యక్షుడు గౌడ్నాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు జగన్నాథం నాయుడు, టీఆర్ఎస్ సీనియర్ నేత పృథ్వీరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.