నారాయణపేట టౌన్, జూలై 28 : ఆటపాటలతో గడుపుతూ, పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో పనిలో మగ్గిపోతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రతియేటా జనవరి మాసంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్, జూలై మాసంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. బాలకార్మికులుగా ఉన్న బాలల మోముల్లో చిరునవ్వులు పూయిస్తూ బడిబాట పట్టిస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో ఎస్పీ వెంకటేశ్వర్లు దిశా నిర్దేశంతో జూలై ఒకటి నుంచి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు నిర్వహించి పలువురు బాలలకు వెట్టి నుంచి విముక్తి కల్పించారు. మహిళా శిశుసంక్షేమం, పోలీస్, కార్మిక, విద్య, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర శాఖలు సమన్వయంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, నిరక్షరాస్యత తదితర కారణాల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపుతున్నారు. హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, కిరాణ దుకాణాలు, భవన నిర్మాణ ప్రాంతాలు, పరిశ్రమలు, పత్తి పంటలు, గొర్రెల కాపరులుగా పిల్లలు పనిచేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో బృందం సభ్యులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి కార్మికులుగా ఉన్న పిల్లలను సీడబ్ల్యూసీకి అప్పగిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట పిల్లలను, వారి తల్లిదండ్రులను హాజరుపర్చి కౌన్సెలింగ్ ఇచ్చి బడికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులకు జరిమానా విధించడం లేదా కేసులు నమోదు చేయడం చేస్తున్నారు.
811మంది బాలలకు విముక్తి..
జిల్లాలో ఐదేండ్లుగా పరిశీలిస్తే.. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మొత్తం 811మంది బాలలకు విముక్తి కల్పించారు. 2019లో ఆపరేషన్ స్మైల్ ద్వారా 53మంది బాలలకు, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 106 మంది మొత్తం 159 మంది బాలలకు విముక్తి కల్పించారు. అలాగే 2020లో ఆపరేషన్ స్మైల్ ద్వారా 75మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. 2021లో ఆపరేషన్ స్మైల్ ద్వారా 125 మంది, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 61 మందికి మొత్తం 186 మంది బాలలకు విముక్తి కల్పించారు. 2022లో ఆపరేషన్ స్మైల్ ద్వారా 57 మందికి, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 166 మందికి మొత్తం 223 మంది బాలలకు విముక్తి కల్పించారు. 2023జనవరిలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ ద్వారా 170 మంది బాలలకు విముక్తి కల్పించారు. జూలై ఒకటి నుంచి ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 98 మంది బాలలకు విముక్తి కల్పించినట్లు అధికారులు తెలిపారు.
బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు..
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బడికి పంపాలి. చదువుకోవాల్సిన బాలలను పనిలో పె ట్టుకుంటే యజమానులపై కఠి న చర్యలు తీసుకుంటాం. 14 ఏండ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం. జిల్లాలో బాల కార్మికులు కన్పిస్తే చైల్డ్లైన్ నెంబర్ 1098 లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారమివ్వాలి. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నది.
– వెంకటేశ్వర్లు, ఎస్పీ, నారాయణపేట