మంత్రాలయం, ఫిబ్రవరి 22 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం మఠంలో 402వ గురు రాఘవేంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి తుంగభద్ర నదీ జలాలతో అభిషేకం, పాదపూజ, పంచామృతాభిషేకం నిర్వహించారు. మూల బృందావనాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించి మంగళహారతలు ఇచ్చారు. అనంతరం ఊయల మండపంలో బంగారు సింహాసనంపై స్వామిని అధిష్టింపజేసి బంగారు పాదుకలను వెండి, బంగారు నాణాలు, ముత్యాలు పుష్పాలతో అభిషేకాలు జరిపారు.
శ్రీమఠంలోని ప్రాకారంలో స్వర్ణ రథంపై ఆశీనులై రాఘవేంద్రుడు భక్తుల హర్షధ్వానాలు, భాజాభజంత్రీల మధ్య ఊరేగారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అటార్ని జనరల్ వెంకటరమణ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పండిట్ గిరియ్యచార్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్కుమార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్ జోషి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహాస్వామి, ధార్మిక అధికారి శ్రీపతి, వ్యాసరాజ్స్వామి పాల్గొన్నారు.