నాగర్కర్నూల్, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. నాగర్కర్నూల్ కలెక్టరేట్లో కమిషన్ సభ్యుడు శంకర్తోపాటు కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్, పోలీస్ అధికారులతో కలిసి ఆయన బుధవారం ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు, కేసు నమోదు ప్రక్రియ, బాధ్యులపై తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం వంటి అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
చిన్నారి తల్లిదండ్రులు అయినటువంటి గణేశ్, మౌనిక, కుటుంబ సభ్యులతో ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, నిందితులకు కఠిన శిక్షలు అమలు జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాధితుల పక్షాన నిలుస్తుందని, బాధితులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు.
ఈసందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ కుమ్మెర ఘటనపై సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహాతో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కుమ్మెర కేసును త్వరగా పరిష్కరించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, బాధితులకు సత్వర న్యాయం అందించే దిశగా ఎస్సీ,ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందన్నారు. అనంతరం బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం గణేశ్, మౌనికలకు రూ.లక్ష చెక్కును అందజేశారు. రాబోయే మూడు నెలలపాటు వారికి నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిందితులపై హత్య కేసుతోపాటు, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించారు.
బాధితులకు కుమ్మెర గ్రామానికి వెళ్లడానికి ప్రాణహాని ఉందని వారు భయంతో ఉన్నారని, నాగర్కర్నూల్లోని డబుల్ బెడ్రూం ఏర్పాటు చేసి, గణేశ్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ను ఆదేశించారు. పోలీసులు పోలీస్స్టేషన్కు ఏదైనా సమస్యపై వచ్చే ఎస్సీ, ఎస్టీ బాధితులకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు వివిధ సంఘాల కుల నాయకులు పాల్గొన్నారు.