పాన్గల్, జనవరి 25 : కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. తమకు దళితబంధు రాకుండా ఎంపీపీ అడ్డుకున్నాడనే నెపంతో కాంగ్రెస్ గుండాలైన ఆది శ్రీను, ఆదిస్వామి మద్యం తాగి పాన్గల్ మండల ఎంపీపీ శ్రీధర్రెడ్డిపై దాడికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పెద్దమ్మ గుడి దగ్గర ఎంపీపీ శ్రీధర్రెడ్డి తన అనుచరులతో కలిసి కూర్చొని మాట్లాడుతుండగా అటు గా ఆది శ్రీను, ఆదిస్వామి పూటుగా మద్యం తాగి వచ్చి ఎంపీపీపై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. అప్పటికే వారితో ఉన్న డీజిల్ ఆయనపై చల్లారు. పక్కనే ఉన్న ఎంపీపీ అనుచరులు దాడిని నిలువరించడంతో అక్కడి నుంచి కాంగ్రెస్ గుండాలు పారిపోయారు. ఎంపీపీ వెంటనే తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం మండలకేంద్రం బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ వచ్చి రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన ఆపే ప్రయత్నం చేశారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేవరకు ధర్నా ఆపేది లేదని భీష్మించుకున్నారు. ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసి 307 హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
ఎంపీపీ శ్రీధర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారనే విషయం తెలుసుకున్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఎంపీపీ ఇంటికి చేరుకొని పరామర్శించారు. జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతనెల పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో మాజీ సైనికుడు మల్లేశ్ హత్య మరువకముందే మళ్లీ ఎంపీపీ శ్రీధర్రెడ్డిపై దాడికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని, దాడి వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తముందని ఆరోపించారు. స్థానిక ఎస్సై పనితీరు బాగాలేదని, పోలీసు యంత్రాంగం పక్షపాత ధోరణిని మంచిపద్ధతి కాదని తెలిపారు. చిల్లరమల్లర బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఇలాంటి చేష్టలకు పాల్పడితే సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, గెలిచినంత మాత్రానా కాంగ్రెస్ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తి లేదన్నారు. గత ఐదేండ్లలో నియోజకవర్గంలో ఎలాంటి దాడులకు పాల్పడకుండా ప్రజాపాలన అందించామని బీరం సమావేశంలో గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రంగినేని అభిలాష్రావు, చంద్రశేఖర్నాయక్, వెంకటయ్యనాయుడు, దశరథ్నాయుడు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.