మహబూబ్నగర్, డిసెంబర్ 6 : ఉద్యోగులు తమకు అప్పగించిన పని సమర్థవంతగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయం సమావేశ మందిరంలో మొదటిసారిగా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సమీకృత కలెక్టరేట్ నుంచి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు, గార్డెన్ను శుభ్రంగా ఉంచేలా శ్రద్ధ వహించాలన్నారు. వెంటనే తమ తమ కార్యాలయాలను పరిశీలించుకొని అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలన్నారు. శుక్రవారం నుంచి వందశాతం పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’ రెండో విడుత కార్యక్రమాన్ని పక్కాగా అమలుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీలో కలెక్టర్ వెంకట్రావుతో మాట్లాడారు. పకడ్బందీగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. మొదటి విడుత 8 నెలలపాటు నిర్వహించామని, కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ విడుతలో మరింత మందికి పరీక్షలు నిర్వహించాలన్నారు. జనవరి 18, 2023నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారంలో శని, ఆదివారాలు తప్ప మిగతా ఐదు రోజులపాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కలెక్టర్లు ప్రణాళిక తయారు చేసి ఏ రోజు వార్డులో, పంచాయతీల్లో ప్రణాళికలను రూ పొందించాలన్నారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతామహంతి కంటివెలుగు కార్యక్రమంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడారు. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి 32బృందాలు అవసరం ఉంటుందని, 2, 3మండలాల్లో జనాభా అత్యధికంగా ఉండడం వల్ల ఎక్కువ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, ఇన్చార్జి డీఎంహెచ్వో శశికాంత్, డీపీవో వెంకటేశ్వర్లు, భూత్పూర్, బాదేపల్లి మున్సిపల్ కమిషనర్లు నూరుల్ నజీబ్, మహమ్మద్షేక్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు బంగారు భవిష్యత్ అందించేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం పిల్లల మర్రి వద్ద కార్మికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వెట్టి కార్మిక చట్టాల జిల్లా సంస్థ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. వెట్టి అనేది ఆనాటి నుంచి వస్తున్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలో అంతగా లేదన్నారు. వెట్టి కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా? లేవా ? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను అందరికీ చేర్చాలని తెలిపారు. ఇటుక బట్టీలు, పౌల్ట్రీలు తదితర సముదాయాలను తనిఖీలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్మికశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, ఎల్డీఎం భాస్కర్, డీపీవో వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడాధికారి శ్రీనివాసులు, ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు.