అయిజ, మార్చి 19 : గ్యాస్ కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సకాలంలో రాకపోవడంతో ఎల్పీజీ కొరత తీవ్రమైనట్లు తెలుస్తోంది. వారం రోజులుగా కస్టమర్లు ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే గంటల తరబడి పడిగాపులు కాస్తూ బాధలు అనుభవిస్తున్నారు. సరిపడా నిల్వలు ఉన్నాయి.. బుక్ చేసుకొంటే ఇంటికి తెస్తారని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు తగ్గట్లుగా కనిపించడంలేదు.
గురువారం ఉగాది పండుగను సైతం లెక్కచేయక అయిజ పట్టణంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు క్యూ కట్టారు. పట్టణంతోపాటు గట్టు, రాజోళి మండలాల్లోని పల్లెలకు చెందిన కస్టమర్లు ఖాళీ సిలిండర్లతో తరలివచ్చి నిరీక్షించారు. ఇప్పటికే ఏజెన్సీలకు కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయగా.. గృహావసరాలకు వినియోగించే సిలిండర్లపై సర్కారు ఆంక్షలు విధించింది. మొన్నటి వరకు నెలకు ఒకటి చొప్పున 12 సిలిండర్లు ఎప్పుడైనా బుక్ చేసుకొనే అవకాశం ఉండగా.. గ్యాస్ కనెక్షన్ ఉన్న కస్టమర్ ప్రస్తుతం ఓటీపీ ద్వారా సిలిండర్ తీసుకుంటే, తిరిగి 45 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలన్న నిబంధన పెట్టారు.
దీంతో గ్యాస్ బుక్ చేసుకోవాలంటే నెలన్నర రోజులు ఎదురుచూడక తప్పని సరి పరిస్థితి. గ్యాస్ కొరతతో చేసేది లేక కొందరు వినియోగదారులు కట్టెల పొయ్యి వినియోగిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో హోటళ్లల్లో వంటచెరుకు వాడుతున్నారు. స్థానిక ఏజెన్సీ పరిధిలో 43 వేల డొమెస్టిక్ కనెక్షన్లు ఉండగా.. కేవలం 504 సిలిండర్లు వినియోగదారులకు అందించగా కొరత తీరడంలేదని కస్టమర్లు చెబుతున్నారు. కనీసం రోజుకూ 1,008 సిలిండర్లు సరఫరా చేస్తే గ్యాస్ కష్టాలు తప్పుతాయంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం గ్యాస్ కష్టాలను తొలగించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.