మహబూబ్నగర్, జనవరి 18 : జంతువులపై ప్రతిఒక్కరికీ దయగుణం ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జంతు సంక్షేమ సంస్థ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జంతు సంరక్షణపై రూపొందించిన పోస్టర్ను మంగళవారం రాత్రి కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమిపై జంతుజాలంతోపాటు మానవజాతి కూడా ఉన్నదని, ప్రకృతి సంరక్షణలో భాగంగా జంతువులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో వాటికి హాని కల్గించకూడదని, ఎవరైనా హింసిస్తే చట్టప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. జంతు సంరక్షణలో భాగంగా ప్రభుత్వం జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీధుల్లో తిరిగే కుక్కలతోపాటు పిల్లులు, ఆవులు ఇతర జంతువులపై ప్రతిఒక్కరూ కరుణతో వ్యవహరించాలని, వాటికి ఆహారం, తాగునీరు అందించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, కె.సీతారామారావు, పశుసంవర్థకశాఖ అధికారి మధుసూదన్గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య తదితరులు పాల్గొన్నారు.