కొత్తకోట : మండలంలోని పాలెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి( Collector Adarsa Surabhi ) గురువారం ఆకస్మి్కంగా తనిఖీ (Collector Inspections ) చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు ( Tents ) , తూర్పార పట్టే ఫ్యాన్ లేకపోవడంపై ఆరా తీశారు.
సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో వచ్చిన వడ్లు, తేమ శాతం, నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. వడ్లు సన్న రకమా , దొడ్డు రకమా అనేది శాస్త్రీయంగా ఎలా నిర్ధారిస్తావు క్యాలీపర్ మీటర్ ద్వారా చూపించమని కొనుగోలు కేంద్రం ఇన్చార్జి అడిగారు. ప్రామాణిక విలువలు ఏంటి అనేది చెప్పకపోవడంతో వెంటనే సెంటర్ ఇన్చార్జిని మార్చాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రతి సెంటర్లో శిక్షణ పొందిన వారిని మాత్రమే సెంటర్ ఇన్చార్జిగా నియమించాలని సూచించారు. వడ్లలో తాలు, గడ్డి అధికంగా కనిపించడంతో పెడస్టల్ ఫ్యాన్, పాడి క్లీనర్ ద్వారా శుభ్రం చేసి కొనుగోలు చేయాలని ఆదేశించారు. దొడ్డు రకం, సన్న రకం కొనుగోలు కేంద్రాలు వేరు వేరుగా నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రైతులు ఉన్నారు.