నాగర్కర్నూల్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : బీసీ కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే దళితులకు రూ.10 లక్షల దళితబంధు, మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు, గొల్లకురుమలకు గొర్రెల పంపిణీతో పాటు నాయీబ్రాహ్మణులు, రజకులకు సబ్సిడీపై విద్యుత్ను అందిస్తున్నారు. ఈ క్రమంలో బీసీల్లో కులవృత్తులను నమ్ముకొన్న 15 కులాల వృత్తిదారులకు రూ.లక్ష అందించే పథకం అమలు కానున్నది. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ గత నెల 9న మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకంతో నాయీబ్రాహ్మణులు, మేదరి, రజకులు, సగర, అవుసలి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, వడ్డెర, కమ్మరి, కంచరి, పూస, మేర, ఆరె కటిక, ఎంబీసీ(బీసీ పరిధిలోకి వచ్చే ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు) వృత్తిదారులకు ఆర్థిక చేయూత లభించనున్నది ఇలా ఆయా కులాల్లో చేతి వృత్తులను నమ్ముకొన్న 18-55 ఏండ్లు కలిగిన ప్రజల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా పూర్తిగావంద శాతం సబ్సిడీతో ఈ పథకం అమలు కానున్నది. ఈ డబ్బులతో చేతి వృత్తి పనులు నిర్వహించుకునేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా విచారణ పూర్తి చేశారు. ఇందులో అర్హులైన లబ్ధిదారుల పేర్ల జాబితాను రూపొందించింది. ఎమ్మెల్యేల సూచన మేరకు అర్హులైన లబ్ధిదారులను ఈ పథకం కోసం ఎంపిక చేస్తారు. ఈ జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రులు ఆమోదిస్తారు. లబ్ధిదారులు చేపడుతున్న పనులను ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేకాధికారి తనిఖీలు చేయనున్నారు. ఇలా రెండేండ్లపాటు తనిఖీలు కొనసాగుతాయి. ఈ సాయాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోవద్దనే నిబంధన ఉన్నది.
ప్రతినెలా 15 నుంచి ప్రక్రియ
పథకానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రతి నెలా 15వ తేదీ నుంచి ఆ నెలాఖరు వరకు రూ.లక్ష అందించే ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. కులవృత్తిదారులందరికీ అందించేందుకు నిరంతర ప్రక్రియకగా కొనసాగనున్నది. ఈ పథకం బీసీ కులాల్లో ఆర్థిక స్వావలంబన పెంచనున్నది. ఈ సాయాన్ని ప్రతి నియోజకవర్గంలో 300 మంది చొప్పున ఈనెలలో అందించనున్నారు. ఆ తర్వాత ప్రతినెలా లబ్ధిదారుల సంఖ్యను బడ్జెట్ ఆధారంగా పెంచనున్నారు.
ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లాలో 11,004 మంది లబ్ధిదారులు
నాగర్కర్నూల్ జిల్లాలో రూ.లక్ష సాయం కోసం 20,670 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 11,004 లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 720 మంది అనర్హులు కాగా 8,946 మంది దరఖాస్తుల విచారణను ఈనెల 18వ తేదీలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎంపిక చేసిన లబ్ధిదారులకు 18 నుంచి 25వ తేదీలోగా పంపిణీ చేయనున్నారు. మొత్తంమీద ప్రతి బీసీ కులవృత్తిదారుడికి ఆర్థికంగా చేయూతను అందించేందుకు తీసుకొచ్చిన పథకంపై ఆయా వర్గాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
18 నుంచి పంపిణీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్లో వచ్చిన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి అర్హుల ఎంపిక చేపడుతున్నాం. ఎమ్మెల్యేల సూచన మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆమోదంతో 18వ తేదీ నుంచి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా రూ.లక్ష సాయం చెక్కులు పంపిణీ చేపట్టనున్నాం. అర్హులైన వృత్తిదారులందరికీ ప్రతినెలా 15వ తేదీ నుంచి ప్రారంభించి నెలాఖరులోగా ఈ సాయం అందించే కార్యక్రమం నిరంతరంగా కొనసాగనున్నది.
– శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ జిల్లాధికారి, నాగర్కర్నూల్