గద్వాల, మే 26 : ప్రజలకు మెరుగైన సేవలు, పాలన అందించేందుకు జిల్లాకేంద్రంలోని పీజేపీ ఆవరణలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4 కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అందు లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలున్నా యి. జూన్ 6న నాగర్కర్నూల్, జూన్ 12న జోగుళాం బ గద్వాల జిల్లా సమీకృత కలెక్టరేట్లను కేసీఆర్ ప్రారంభించనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లాకేంద్రంలోని పీజేపీ క్యాంపు కార్యాలయ ఆవరణలోని ఓ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయం నిర్వహి స్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభమవుతుండడంతో నడిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణం ఇలా..
జిల్లాకేంద్రంలోని పీజేపీ క్యాంపు కార్యాలయ ఆవరణలో కలెక్టరేట్ నిర్మాణంతోపాటు వారి క్యాంపు కార్యాలయాలు, నివాసగృహాలు, ఎస్పీ, క్యాంపు కార్యాలయాల కోసం 20 ఎకరాలను సేకరించారు. అందులో ప్రస్తుతం ఆరెకరాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రూ.51.18కోట్లతో మూడు అంతస్తుల్లో వివిధ శాఖలకు చెందిన 36 జిల్లాస్థాయి కార్యాలయాలను నిర్మించారు. కలెక్టర్ కార్యాలయంతోపాటు అదనపు కలెక్టర్ కార్యాలయాలు, వీడియో కాన్ఫరెన్స్హాల్తోపాటు విశ్రాంతి హాల్ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ భవనం సమీపంలో ముఖ్య అధికారులు ఉండేందుకు ఎనిమిది నివాస భవనాలను నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులో జిల్లా అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
గ్రౌండ్ ఫ్లోర్లో..
కలెక్టర్ కార్యాలయంతోపాటు జిల్లా పౌరసంబంధాలశాఖ, కోశాధికారి, స్ట్రాంగ్ గది, జిల్లా శిశుసంక్షేమశాఖ, చైల్డ్ వెల్ఫేర్, వికలాంగుల, వృద్ధుల, ట్రాన్స్జెండర్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
ఫస్ట్ ఫ్లోర్లో..
జిల్లా వ్యవసాయశాఖ, ఆత్మ, ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, ముఖ్యప్రణాళిక, భూగర్భజల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సహకార, ఇంటర్మీడియట్, జిల్లా విద్యాశాఖ, జిల్లా పంచాయతీ కార్యాలయం, మిషన్ భగీరథ (ఇంట్రా, వాటర్గ్రిడ్), జిల్లా చేనేత, జౌళీశాఖ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, వైద్యశాఖ కార్యాలయాలకు కేటాయించారు.
సెకండ్ ఫ్లోర్లో..
జిల్లా పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్, లీగల్ మెట్రాలజీ, ఆడిట్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ), నీటిపారుదల, రోడ్లుభవనాలు, ఎక్సైజ్శాఖ, అటవీ, పరిశ్రమల, కార్మిక, భూగర్భగనుల శాఖ కార్యాలయాలకు కేటాయించారు. అధికారుల పనితీరు పర్యవేక్షించడానికి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సీసీ కెమెరాలు అమర్చారు. ప్రజలకు పారదర్శకమైన, మెరుగైన పాలన అందించేందుకు సమీకృత కలెక్టరేట్ భవనాలు ఎంతగానో ఉపయోగ పడుతాయని అధికారులతోపాటు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన పాలన అందించే అవకాశం
నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభమైతే ప్రజలకు మెరుగైన పాలనతోపాటు సేవలు అందే అవకాశం ఉంది. జిల్లాల ఏర్పాటు అనంతరం కార్యాలయాలు పలు చోట్ల ఉండడం వల్ల ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు. వారికి అన్ని రకాల సేవలు ఒకేచోట అందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. జిల్లా అధికారులంతా ఒకేచోట ఉండడం వల్ల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడానికి అవకాశం ఏర్పడింది.
– కృష్ణమోహన్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే