గద్వాల/అలంపూర్, నవంబర్ 6: “ధరణిని బంగాళాఖాతంలో కలపాలని కాంగ్రెసోళ్లు అంటునరు.. దళారీ వ్యవస్థ లేకుండా ధరణిని రూపొందించాం.. దాని ద్వారానే రైతులకు రైతుబంధు, బీమా ఇస్తున్నాం.. ధరణి లేకపోతే ఇది సాధ్యం కాదు.. ఇగ్గం, ఎవుసం తెలియని రాహుల్గాంధీ ధరణి వద్దంటున్నారు. వారికి మళ్లీ దళారీ వ్యవస్థ తీసుక రావాలనే ఆలోచన ఉంది. అటువంటి వాళ్లను బంగాళాఖాతంలోకి విసిరి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం అయిజ రహదారిలో తెలంగాణ చౌరస్తా సమీపంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అధ్యక్షతన ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా ముఖ్యమంత్రి పాల్గొని కాంగ్రెస్పై ఘాటు విమర్శలు చేశారు. గద్వాలకు ఎంతో చరిత్ర ఉందని, జోగుళాంబ అమ్మవారి పేర జిల్లాను ఏర్పాటు చేసుకొని ఆమె ఆశీర్వాదంతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికలు వస్తుంటయి.. పోతుంటయి.. కానీ ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, పార్టీని ప్రజలు ఆదరించాలన్నారు. అధికారంలోకి వచ్చే పార్టీలు పేదల కోసం ఏం చేస్తాయో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల చరిత్ర అందరికీ తెలుసని, వాటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా-తుంగభద్రా నదుల మధ్య ఉన్న నడిగడ్డను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కృష్ణా నీళ్లు మాకొద్దని ఆంధ్రాప్రాంతం నాయకుడి వెంట ఇక్కడి కాంగ్రెస్ నాయకురాలు వెళ్లి హారతులు పట్టిందని.. ఇది కాంగ్రెస్ చరిత్ర అని దుయ్యబట్టారు. హస్తం పార్టీ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వాల్మీకి బోయలను ముంచాడని, ఆయన ఆనాడు వారిని ఎస్టీ జాబితాలో చేర్చే అవకాశం ఉన్నా పట్టించుకోలేదన్నారు.
తమ ప్రభుత్వం వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోలేదని.. ఈసారి గెలిపిస్తే కేంద్రం మెడలు వంచైనా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తామన్నారు. ఆర్డీఎస్ను ఆగం పట్టించింది ఎవరో ఈ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు.. కరువుతో నడిగడ్డ గోసపడ్డది.. పిడికెడు మందితో ఇక్కడి నుండి ఉద్యమం చేసి రైతుల స్థితిగతులు తెలుసుకున్నామన్నారు. 2004లో తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసిందని.. ఆ సమయంలో టీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం కూడా చేసిందన్నారు. కేసీఆర్ సచ్చుడో-తెలంగాణ వచ్చుడో అని బలమైన ఉద్యమం చేస్తే విధి లేని పరిస్థితిలో తెలంగాణను ఇచ్చిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నెట్టెంపాడ్ ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరు అందగా స్వరాష్ట్రంలో ప్రస్తుతం 1.60లక్షల ఎకరాలకు అందుతున్నదన్నారు. గట్టు ఎత్తిపోతల పనులు చకచకా జరుగుతుండగా జిల్లా కేంద్రంలో సెంట్రల్లైటింగ్ ఏర్పాటుతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన బస్స్టాండ్, జూరాల వద్ద బృందావనం పార్కు పనులు జరుగుతున్నాయన్నారు. గద్వాలకు నర్సింగ్ కళాశాలతోపాటు మెడికల్ కళాశాల మంజూరు చేశామని, వైద్యపరంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో 300 పడకల దవాఖాన పనులు పూర్తి చేశామన్నారు. పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్న పార్టీకి ఓటు వేస్తారో.. ఉచిత హామీలు ఇచ్చి మోసం చేసే వారికి ఓటు వేస్తారో ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు.
తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ మార్చి నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. ఓటర్లు ఆగమాగమై ఓటు వేయకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వద్దంటున్నడు.. రేవంత్ మూడుగంటల కరెంట్ చాలు అంటున్నడు.. ఇలా రైతు సంక్షేమ పథకాలు నిలిపి వేయాలనుకునే వారికి మీరు ఓటేస్తే వారు రైతుబంధుకు రాంరాం పలుకుతారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనన్నారు. గత కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్త కరెంట్ ఉండడం వల్ల రైతులు రాత్రిపూట పొలాలకు మోటర్ల ద్వారా నీరు పెట్టడానికి వెళ్లి పాముకాటు, విద్యుత్షాక్కు గురైన ఘటనలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం రైతులు తమకు ఇష్టం వచ్చినప్పుడు నీరు పారించుకోవడానికి ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని చెప్పారు. ధరణి రద్దు చేస్తే ప్రజలు ఆగమవుతారని, ధరణి ఉంది కాబట్టే రైతుల ఖాతాల్లో ఎటువంటి కమీషన్ లేకుండా రైతుబంధు పడుతుందన్నారు. ధరణి వద్దంటే దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందని వివరించారు. గద్వాల అభివృద్ధికి నిరంతరం పాటుపడే కృష్ణమోహన్రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని చెప్పారు. సమావేశంలో ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాధం, మున్సిపల్ చైర్మన్ కేశవ్, గద్వాల అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి రాకేశ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, మార్కెట్కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, జెడ్పీ వైస్చైర్మన్ చైర్మన్ సుభాన్, మాజీ జెడ్పీ చైర్మన్ భాస్కర్, నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 6 : నారాయణపేటలో ప్రజా ఆశీర్వాద సభ ముగించుకొని మహబూబ్నగర్కు విచ్చేసిన సీ ఎం కేసీఆర్కు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు గులాబీపూలతో ఘన స్వాగతం పలికారు. రోడ్ షో ఉం దని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు అధికసంఖ్యలో వన్టౌన్ చౌరస్తాకు చేరుకొ ని సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ వె ళ్తున్న బస్సుపై గులాబీపూలు వేస్తూ స్వాగతం పలికారు. కాగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులకు అభివాదం చేస్తుండగా బస్సు ముందుకుసాగింది. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ ప్రజలు నినదించారు. వన్టౌన్ చౌరస్తాతోపాటు శివశక్తినగర్ కమాన్, భగీరథ కాలనీ, క్రిస్టియన్పల్లి, బైపాస్ రోడ్డు, పాలకొండ చౌరస్తా, పిస్తాహౌస్తోపాటు పలు ప్రధాన కూడళ్లకు బీఆర్ఎస్ నాయకులు భారీస్థాయిలో చేరుకొని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో హన్వాడ ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ నేతలున్నారు.