బీఆర్ఎస్.. రాష్ట్రంలో ప్రజాదరణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అలాంటి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారు. రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు పటిష్టంగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. పార్టీలో చిన్నచిన్న లోటుపాట్లు కూడా లేకుండా బలమైన శక్తిగా మార్చేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావును బాధ్యులుగా ఎంపిక చేశారు.
నాగర్కర్నూల్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి పార్టీకి రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు మెండుగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ నుంచి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్గా మారింది. ఈ క్రమంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో సాధారణ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఇప్పటి నుంచే పార్టీని సన్నద్ధం చేసేందుకు నడుంబిగించారు. రాబోయే కాలంలో పార్టీ ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యం గా అంబేద్కర్ జయంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగాల ఏర్పాటు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు వంటి పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. జిల్లాల ఏర్పాటు, నూతన పరిపాలన భవనాలు, పెండింగ్, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్లు, ఇతర భవనాల నిర్మాణం, రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ఇక సామాన్యుల కోసం ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, బీమా, దళితబంధు, నాయీబ్రాహ్మణులు, రజకులు, చేనేత, బీడీ కార్మికులకు, గొల్ల కురుమలకు, మత్స్యకారుల్లాంటి సబ్బండ వర్గాల ప్రజ ల కోసం పలు పథకాలు అమలవుతున్నాయి. ఈ కారణంగా గత 2014, 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీకి స్థానిక సంస్థల నుంచి సాధారణ ఎన్నికల వరకూ ప్రజలు భారీ ఆధిక్యం కట్టబెడుతున్నారు. ఇలా అత్యధిక ప్రజల బలం పొందిన పార్టీగా బీఆర్ఎస్ బలంగా మారింది. ప్రజలంతా తమ ఇంటి పార్టీగా భావిస్తూ సీఎం కేసీఆర్కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో దేశ అభివృద్ధి కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కార్యరంగంలోకి దిగారు. దీంతో పార్టీని పటిష్టం చేస్తూ గ్రామస్థాయిలోనూ చెక్కు చెదరకుండా ఉండేలా మంత్రి కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాల నిర్మాణం, జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టారు. ఈ క్రమంలో రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాల నిర్వహణకు సూచించారు. ఇందులో భాగంగా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. అలాగే అంబేద్కర్ జయంతి నిర్వహించ డం, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగాల ఏర్పాటు, నియోజకవర్గ ప్రతినిధుల సభలు నిర్వహించేందుకు కార్యాచరణ సూచించారు. ఈ కార్యక్రమాలు పటిష్టంగా అమ లు చేసేందుకుగానూ ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు ఎమ్మెల్సీలను ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమించారు.
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు కల్వకుర్తి ఎమ్మె ల్సీ కసిరెడ్డి నారాయణరెఢ్డి, నాగర్కర్నూల్ జిల్లాకు పట్నం మహేందర్రెడ్డి, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాకు తక్కళ్లపల్లి రవీందర్రావును ఇన్చార్జిగా కేటాయించారు. ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులతో జిల్లా ఇన్చార్జీలతో సమన్వయం చేసుకోనున్నారు. కార్యక్రమాల అమలును పర్యవేక్షించడంతో పాటుగా స్థానిక పరిస్థితులను అధిష్టానానికి వివరించడం, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇన్చార్జీలు చర్యలు తీసుకోనున్నారు. మొత్తంమీద బీఆర్ఎస్నరు మరింత బలోపేతం చేసేందుకు జిల్లా ఇన్చార్జీలను నియమించడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో దూకుడు పెరగనున్నది.