పెంట్లవెల్లి, మార్చి 2: వానకాలం వస్తే చాలు పెంట్లవెల్లి నుంచి ఏటిగడ్డ తీరప్రాంత గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఆపసోపాలు పడేవారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగును దాటాల్సిన దుస్థితి. సమైఖ్య పాలనలో దశాబ్దాల తరబడి ఏటిగడ్డ గ్రామాల ప్రజల కష్టాలకు ప్రతి రూపమైన పెంట్లవెల్లి-ఎంగంపల్లితండా గ్రామాల మధ్యనున్న వాగుపై వంతెన నిర్మాణాన్ని గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం సిద్ధించాక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రత్యేక చొరవతో ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభించింది. మండలకేంద్రం నుంచి ఎంగంపల్లితండా గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగుపై చెక్డ్యాంతోపాటు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పంచాయతీరాజ్శాఖ ద్వారా రూ.9.60కోట్లు మంజూరు చేసింది.
దీంతో వంతెన నిర్మాణానికి భూమిపూజ చేసిన అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టారు. ఈక్రమంలో వంతెన పనులు 90శాతం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఏటిగడ్డ తీరప్రాంత గ్రామాల చిరకాల కోరిక నెరవేరుస్తుండటంతో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాగు పొంగితే రాకపోకలు బంద్!
వానకాలం వచ్చిందంటే పెంట్లవెల్లి శివారులోని వాగు పొంగడంతో కృష్ణానది తీర గ్రామాలైన ఎంగంపల్లితండా, మల్లేశ్వరం, ఎంకల్, మంచాలకట్ట, మాధవస్వామినగర్తోపాటు సోమశిల ప్రజలకు మండలకేంద్రంతో రాకపోకలు స్తంభించిపోయేవి. ఆ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లవు. తమ అవసరాల కోసం ప్రజలు నిత్యం పెంట్లవెల్లికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో తమ గోడును కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి దృష్టి తీసుకుపోగా ఆయన స్వయంగా గత వానకాలంలో పొంగిన వాగును పరిశీలించారు. అదే సందర్భంలో వాగు దాటుతున్న ప్రజల అవస్థను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే వచ్చే వానకాలం నాటికి ఎంగంపల్లితండా-పెంట్లవెల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. బ్రిడ్జి విషయాన్ని సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వివరించి ఎంగంపల్లితండా వాగుపై చెక్డ్యాంతోపాటు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.9కోట్ల 60లక్షల నిధులు మంజూరు చేయించారు. ఎన్నో దశాబ్దాలుగా నిలిచిపోయిన ఏటిగడ్డ ప్రజల కోరిక ఎమ్మెల్యే బీరం చొరవతో నేరవేరడంతో వారు ధన్యవాదాలు తెలుపుతునారు.