నాగర్కర్నూల్, మార్చి 5 :మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార(న్యూట్రిషన్) కిట్ అందిస్తున్నది. రక్తహీనత సమస్యతో గర్భిణులు, బాలింతలు సతమతమవుతున్నారు. 70 శాతానికి పైగా పౌష్టికాహార లోపమే ఇందుకు కారణమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే మహిళ గర్భం దాల్చగానే న్యూట్రిషన్ కిట్లు అందించి పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చర్యలు చేపట్టింది. నాగర్కర్నూల్ జిల్లాలో గతేడాది డిసెంబర్ 21న పథకాన్ని ప్రారంభించగా.. 17,145 మందిని
గుర్తించి 6 వేల మందికి కిట్లను పంపిణీ చేశారు.
రాష్ట్రంలోని మారుమూల జిల్లాలతోపాటు గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందించేందుకుగానూ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నది. ఇందుకుగానూ మొదటి విడుతలో నాగర్కర్నూల్ జిల్లాను ఎంపిక చేసింది. రక్తహీనత లోపం కారణంగా తల్లి, బిడ్డ అనారోగ్యానికి గురికావడంతోపాటు ప్రసూతి మరణాలకు దారితీస్తున్నది. గర్భస్రావం, నెలలు నిండకుండా, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటిని గుర్తించిన ప్రభుత్వం పౌష్టికాహారం కిట్లు అందజేస్తున్నది.
నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 17,145 మంది మహిళల్లో రక్తహీనత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతి గర్భిణికి 5, 9 వ నెలల్లో రెండు విడుతలుగా న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నది. దాదాపు రూ.2 వేల విలువగల ఈ కిట్లలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ 2 కిలోలు, కిలో ఖర్జూరాలు, 3 ఐరన్ సిరప్ సీసాలు, ప్లాస్టిక్ బుట్ట, వస్త్రం సంచి, 500 గ్రాముల నెయ్యి, ఒక కప్పు, ఆల్బెండజోల్ మాత్రలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆరు వేల మందికి పైగా కిట్లను పంపిణీ చేశారు. ఇంకా మూడు వేల మందికి ఇచ్చేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన గర్భిణుల్లో వెయ్యి మందికి కిట్లను అందజేయాల్సి ఉండగా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. అంతేకాకుండా గర్భిణులు, బాలింతలకు పలు సూచనలు చేస్తున్నారు.
న్యూట్రిషన్ కిట్ బాగున్నది..
ప్రభుత్వం అందజేసిన న్యూట్రిషన్ కిట్ బాగున్నది. ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నా. మొదటి కాన్పులో పాప పుట్టినప్పుడు రక్తహీనత, సరైన ఆహారం తీసుకోకపోవడంతో కొంత ఇబ్బందిగా ఉండింది. రెండో కాన్పు సందర్భంగా ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ అందించింది. కడుపులో బిడ్డ ఎదిగేందుకు అందించిన కిట్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
– క్రాంతి, నాగర్కర్నూల్
గర్భిణుల ఆరోగ్యమే లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం అందించిన న్యూట్రిషన్ కిట్లను ప్రతి గర్భిణికి అందజేస్తున్నాం. రక్తహీనత, గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కిట్లను పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాల్లో నాగర్కర్నూల్ ఉండడం అభినందనీయం. గర్భిణులకు ఆరోగ్య సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ కిట్లను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా మారాలి.
– సుధాకర్లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్