మహబూబ్నగర్ : జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ లేనందున వేల మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి, వనపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో ఎమ్మెల్యే మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో కూడా జూనియర్ కాలేజ్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని..కావున చిన్న చింతకుంట మండల కేంద్రానికి జూనియర్ కాలేజ్ ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి స్పందించి దేవరకద్ర నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ , చిన్న చింతకుంట మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ ను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అడిగిన మూడు అంశాలను నోట్ చేసుకున్నామని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి డిగ్రీ కాలేజీ,చిన్న చింతకుంట మండల కేంద్రానికి జూనియర్ కాలేజీని, అడ్డాకుల మండల కేంద్రానికి కేజీబీవీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని మంత్రి తెలిపారు.