నవాబ్పేట, సెప్టెంబర్24: ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వద్ద తన వాహనానికి పూజ చేయించుకునేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన రుద్రారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడి కారుపై స్థానిక ఎస్సై పురుషోత్తం దాడి చేసి..అద్దాలు ధ్వంసం చేయడం ఆదివారం మండలంలో చర్చనీయాంశంగా మారింగి. దాడి చేసి ధ్వంసం చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టడంతో హల్చల్గా మారింగి. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు జైపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఫతేపూర్ మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లి పూజ చేయించాడు. అనంతరం తిరిగి వస్తుండగా.. మైసమ్మ ఆలయ శివారులో సిబ్బందితో కలిసి ఉన్న ఎస్సై పురుషోత్తం తన చేతిలో ఉన్న లాఠీతో జైపాల్రెడ్డి కారు ముందు భాగం అద్దంపై దాడి చేయడంతో అద్దం పూర్తిగా ధ్వంసమైంది.
దీంతో తీవ్ర అసహనానికి గురైన జైపాల్రెడ్డి ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. మైసమ్మ వద్దకు మొక్కు తీర్చుకునేందుకు, పూజలు చేసుకునేందుకు వస్తే కూడా ఇలా దాడి చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని జైపాల్రెడ్డి తెలిపారు. ఎస్సై దాడి చేసి ధ్వంసం చేసిన కారు దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి హల్చల్గా మారాయి. ఎస్సై ఇలా దురుసుగా ప్రవర్తిస్తే ఎలా అంటూ పలువురు చర్చించుకోవడం వినిపించింది. కాగా ఇట్టి విషయమై ఎస్సై పురుషోత్తంను వివరణ కోరగా…శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వాహనాన్ని ఆపానని అతను ఆపకపోవడంతో కర్ర తగిలి ఉంటుందని చెప్పారు.