కోస్గి, డిసెంబర్ 2: మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు పాఠశాలలను కలెక్టర్ శ్రీ హర్ష తనిఖీచేశారు. శుక్రవారం మండలంలోని గుండుమాల్, బోగారం కోస్గి పట్టణంలోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నతపాఠశాల, సీపీఎస్ పాఠశాల ఉడ్దూమీడియం, సర్జాఖాన్పేట ఉన్నత పాఠశాలలను తనిఖీచేశారు. పాఠశాలలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఎక్కడా పనిలో పురోగతిలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోస్గి జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాల కావడంతో మూత్రశాలలు, డైనింగ్, కిచెన్షెడ్లు సరిగాలేవని చెప్పడంతో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
సీపీఎస్ పాఠశాల ప్రహరీ నిర్మాణం పదిహేను రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. పాఠశాలఆవరణలో మురుగు పారుతుందని వెంటనే పాఠశాల పరిసరప్రాంతాలను శుభ్రంచేయాలని మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ను ఆదేశించారు. అనంతరం సర్జాఖాన్పేట ఉన్నతపాఠశాలను తనిఖీచేశారు. విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఎలా చదువుకుంటున్నారని కలెక్టర్ వారితో ముచ్చటించారు. మండలంలో మొదటివిడతగా మనఊరు మనబడిలో 21 పాఠశాలలు ఎంపికకాగా పనులు సరిగా జరగడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెట్పీటీసీ ప్రకాశ్రెడ్డి, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, ఆర్ఎన్బీడీఈ రఘు తదితరులున్నారు.
నారాయణపేట రూరల్, డిసెంబర్ 2: తొలిమెట్టు అమలులో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులే కీలకమని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం స్థానిక కేజీబీవీలో జరిగిన కాంప్లెక్స్ నోడల్ అధికారుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అక్షరాస్యతలో వెనుకబాటు అన్నింటిలో వెనుకబాటుకు కారణమవుతుందన్నారు. పిల్లలు పాఠశాలలో చేరిన తర్వాత వారి పూర్తి బాధ్యత ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే తీసుకోవాలన్నారు. ప్రతినెల నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలు మొక్కుబడిగా కాకుండా నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అనువుగా నిర్వహించాలన్నారు.
ఇదే క్రమంలో ఉపాధ్యాయులు మూస ధోరణిని విడిచిపెట్టి నూతన విధానాలకు అనుగుణంగా తరగతి బోధన చేయాలని, తరగతి సామర్ధ్యాలు జనవరి 2023లోపే సాధించాలన్నారు. ఎన్సీఆర్టీ ఈడీ మధుసూదన్రెడ్డి, వీరేశం, మౌనిక బృందం ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్మిట్టల్, ఏఎంవో విద్యాసాగర్, వివిధ మండలాల ఎంఈవోలు, కాంప్లెక్స్ నోడల్ అధికారులు, మండల నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.