మహబూబ్నగర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మద్దిమడుగు ఆంజనేయ స్వామి పేరు చెప్పి దుందుభీ వాగులో ఇసుక దోపిడీకి తెరలేపిన ఘటన బుధవారం సంచలనం సృష్టించింది. అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా చివరకు దేవుళ్లను కూడా వదలడం లేదు. కలెక్టర్ బదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయానికి ఎనిమిది టిప్పర్ల ఇసుకను ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చా రు.
ఉప్పునుంతల తాసీల్దార్ కల్వకుర్తికి చెందిన రమేశ్ రెడ్డికి అనుమతులు ఇచ్చారు. ఈ పేరు మీద అక్కడ ఇసుక మాఫియా ఏకంగా ఒక్కరోజు మొత్తం దుందుభీ వాగులోని ఇసుకను తవ్వుకున్నారు. వివరాల్లోకి వెళితే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ ఉప్పునుంతల మండలంలోని దాసర్లపల్లి గ్రామ సమీపంలో అనధికారక ఇసుక దందా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తోంది. అయితే పదర మండలం మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయంలో కొన్ని నిర్మాణాల కోసం ఆలయ చైర్మన్ రాములు నాయక్ 8 టిప్పర్ల ఇసుక కోసం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఫోన్ చేసి చెప్పారు.
అయితే కలెక్టర్కు, ఎంఆర్వోకు చెబుతారని ఎమ్మెల్యే చెప్పడంతో సదరు ఆలయ చైర్మన్ మామిళ్లపల్లి వెంకటేశ్వరస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ నరసింహారావును కలిసి ఇసుక కోసం దాసర్లపల్లి నుంచి పంపించాలని కోరారు. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు మద్దిమడుగు ఆంజనేయస్వామి పేరుతో ఇసుక దోపిడీకి తెరలేపారు. 8 ట్రిప్పుల స్థానంలో ఏకంగా 100 ట్రిప్పులను పోలీసు బందోబస్తు పెట్టి ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
రెవెన్యూ పోలీస్ యంత్రాంగానికి భారీ ఎత్తున ముడుపులు ముట్ట చెబుతున్నామని మమ్మల్ని ఎవరూ అడ్డుకునే వారే లేరని.. పేపర్లో రాస్తే ఏమవుతుందని అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా నడిపిస్తున్న నేత ఒకరు బహిరంగంగా అంటున్నారు.. ప్రభుత్వ ఖజానాకు నయా పైసా చెల్లించకుండా భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్న అధికారులు స్పందించి ఇసుక మాఫియాపై చర్య తీసుకోకపోతే దుందుభీ వాగు వట్టిపోయే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.