ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అక్షరజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆట వస్తువులతో ఆడిస్తూ.. చిన్నారుల దృష్టిని ఆకర్షించేలా అంగన్వాడీ టీచర్లు అక్షరాలను నేర్పిస్తున్నారు. బడి అంటే భయం పోయేలా ఆట, అక్షరాల బొమ్మల రూపంలో బోధన అందిస్తున్నారు.ఇందుకోసం ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాలకు ప్రీస్కూల్ కిట్లను అందజేశారు. ఇందులో భాగంగానే మూడు నుంచి ఆరేండ్ల పిల్లల్లో మేథో శక్తిని, నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. సమయానికి పౌష్టికాహారం అందజేస్తూ విద్యతోపాటు పసిప్రాయంలోనే శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఎన్హెచ్టీఎస్ యాప్ను రూపొందించారు. చిన్నారుల వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. సరస్వతీ నిలయాలైన ఈ కేంద్రాల్లో మరింత పారదర్శకంగా సేవలు అందుతున్నాయి.
పెబ్బేరు, డిసెంబర్ 16: బడి అంటే భయపడటం.. నిత్యం బడికి వెళ్లడానికి పిల్లలు మారం చేయడం.. ప్రతి ఇంట్లో నిత్యకృత్యమే. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించి అక్కడే ఆట వస్తువులతో ఆడిస్తూ.. అక్షరాలకు అంకురార్పణ చేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు. చిన్నపిల్లల దృష్టిని ఆకర్శంచి బడి అంటే ఉన్న భయాన్ని విడనాడేలా ఆట వస్తువులు, అక్షరాల బొమ్మల రూపంలో అందించే విధానాలతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ఐసీడీఎస్ అధికారులు ఇప్పటికే ప్రీస్కూల్ కిట్లు అందించారు. వీటిని వినియోగించి కనీసం అభ్యసన స్థాయి గల పిల్లలకు అక్షరాలను నేర్పించేందుకు అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. పిల్లలకు నేరుగా అక్షరాలను నేర్పిస్తే వారికి ఇష్టం ఉండదని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు వారిని అక్షర, అభ్యాసన వైపు ఆటల విధానంలో మరల్చడానికి ప్రీస్కూల్ కిట్ రూపొందించారు. దీంట్లో భాగంగానే మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లల మేధాశక్తిని పెంపొందించడానికి అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీస్కూల్ కిట్లు పంపిణీ చేసింది. చిన్నపిల్లలకు సమయానికి పౌష్టికాహారం అందించి నిత్యం ప్రీస్కూల్ కిట్లతో విద్యాబోధన చేసి చిన్నారులకు అంగన్వాడీలపై ఆసక్తి పెంచుతున్నారు.
ప్రీస్కూల్ కిట్లతో పిల్లలు స్వయంగా అభ్యసనం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగేలా తోడ్పడుతున్నాయి. ఇవే కాకుండా పిల్లలు సాధారణ పాఠశాలకు అలవాటయ్యేందుకు పెన్సిల్, బలపం పట్టుకోవడం, మునివేళ్లమీద నడవడం అంగన్వాడీ కేంద్రాల్లోని బోధనతోనే మొదలవుతుంది. అలాగే ఐదు మీటర్లు వేగంగా పరిగెత్తడం, బంతిని నిర్ధేశించిన దిశలో విసరడం, తన్నడం, తన పనులు తానే చేసుకోవడం వంటి నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. ఇతరులతో స్వేచ్ఛగా మాట్లాడడం, తన అవసరాలను వ్యక్త పర్చడం, తన కుటుంబం గురించి మాట్లాడటం, తప్పొప్పులను తెలుసుకోవడం, బయపడకుండా ఆడుకోవడం, ఉద్వేగాలను గుర్తించటం చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు నేర్పిస్తున్నారు. వినడం, వివిధ అంశాలపై స్పష్టత వచ్చేలా కథల రూపంలో, సంఘటనల రూపంలో బోధన చేస్తున్నారు. అంగన్వాడీస్థాయిలో 1 నుంచి 10వరకు అంకెలను లెక్కించడం, కూడికలు, తీసివేతలు చేయడానికి బోధనలో ప్రీస్కూల్ కిట్లను ఉపయోగిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల పూర్తిస్థాయి పర్యవేక్షణకు ఎన్హెచ్టీఎస్ యూప్ను అమలుచేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు యాప్పై శిక్షణ ఇచ్చారు. ఎన్హెచ్టీఎస్ యాప్లో టీచర్ల హాజరు, చిన్నారుల పెరుగుదల పర్యవేక్షణ, ఆహారనిల్వలు, గర్భిణుల వివరాలు, టీకాలు వేసే సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్లో అంగన్వాడీల సమగ్ర వివరాలు ఉండడంతో చిన్నారులకు వందశాతం పౌష్టికాహారం సక్రమంగా అందడం, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడటానికి దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా పరిధిలో వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో 589అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవి 545, మినీ అంగన్వాడీ కేంద్రాలు 44 ఉండగా అందులో 0-6ఏండ్ల వయసున్న పిల్లలు 31,431మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
చిన్నారులకు అక్షరాలు, అభ్యాసన వైపు మరల్చి ఆటలతో కూడిన ప్రీస్కూల్ కిట్లు దోహదపడుతున్నాయి. స్వయంగా అభ్యాసనం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు మరింత పారదర్శకంగా ఉండాలని ఎన్హెచ్టీఎస్ యాప్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ యాప్పై శిక్షణ ఇచ్చాం. బాల్యం బలంగా ఉంటే చిన్నారుల భవిష్యత్ బాగుటుంది. తల్లిదండ్రులు చిన్నారులను అంగన్వాడీలకు పంపించాలి.
– పుష్పలత, స్త్రీశిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి, వనపర్తి