‘అంధ’జ్యోతి దినపత్రిక తెలంగాణ గురుకుల వ్యవస్థపై అక్కసును వెల్లగక్కుతున్నది. గోరంతను కొండంతగా చేయడం.. నచ్చని వారిపై, వ్యవస్థలపై, ప్రభుత్వంపై అసత్యపు కథనాలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరులో ట్రాన్స్ఫార్మర్ రిపేరుకు నోచుకోవడంతో జ్యోతిబాఫూలే బాలికల బీసీ గురుకుల పాఠశాలలో కొంత నీటి కొరత ఏర్పడింది. సర్పంచ్ నారాయణమ్మ స్పందించి పంచాయతీ ట్యాంకర్తో నీటిని సరఫరా చేశారు. ఆదివారం సాయంత్రానికే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కూడా చేశారు. అయితే దీన్ని సాకుగా చూపుతూ స్కూల్లో నీటి కొరత ఉన్నదని సదరు పత్రిక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ఇలా ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరిన్ని తప్పుడు వార్తలు రాస్తూ నవ్వుల పాలవుతున్నది. ఆధారాలు లేకుండా ప్రచురితం చేస్తున్న కథనాలు చదివిన పాఠకులు ముక్కున వేలేసు కుంటున్నారు. తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టు కూతురే గురుకులంలో చదువుతుండగా.. ఇక్కడ సమస్య లేదని చెప్పడం కొసమెరుపు. స్కూల్ ప్రిన్సిపాల్ను సంప్రదించకుండా ఫోకస్ కోసం కల్పిత వార్తలు ప్రచురిస్తుండడంతో ఆ పత్రిక అభాసుపాలవుతున్నది.
అబద్ధాన్ని కప్పి పుచ్చుకునేందుకే..
‘నమస్తే తెలంగాణ’ పాత్రికేయ బృందం పుల్లూరు గురుకుల పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థుల వద్ద వివరాలను తెలుసుకున్నారు. ఆంధ్రజ్యోతి కథనంలో ఉన్న అవాస్తవాలను ‘నమస్తే’లో ప్రచురించారు. అయితే, నిజాలను నిర్భయంగా చెప్పిన ‘నమస్తే’పై ఆంధ్రజ్యోతి పత్రిక బుధవారం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఈ క్రమంలో బుధవారం నమస్తే తెలంగాణ బృందం మరోమారు పాఠశాలను సందర్శించింది. ఉపాధ్యాయులు, విద్యార్థినులు ‘అంధ’జ్యోతి విలేకరి గురించి విస్తుపోయే నిజాలను చెప్పారు. సదరు పాత్రికేయుడు ఇష్టం వచ్చినప్పుడు పాఠశాల లోపలికి వచ్చి ఫొటోలు తీయడంతోపా టు ఉపాధ్యాయులతో నానా హంగామా చేసేవాడని తెలిపారు. తమకు తెలియకుండానే సెల్ఫోన్లో ఫొటోల ను చిత్రీకరించి.. తమ పే రుపై వార్తను రాశాడని బాలికలు కన్నీటిపర్యంతమయ్యారు. అసిస్టెంట్ ప్రి న్సిపాల్తో మాట్లాడి తన కు అనుకూలంగా వార్త రాసినట్లు ప్రిన్సిపాల్ దేవానందం ఎమ్మెల్యే అబ్రహం దృష్టికి తీసుకెళ్లారు.
24 గంటల త్రీఫేజ్ విద్యుత్ సమస్య ఆదివారం సాయంత్రం 4 గంటలకే పరిష్కారమైంది. అయితే, సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో గురుకుల, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులకు తలనొప్పిగా మారింది. వాస్తవాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అబ్రహం పాఠశాలకు చేరుకొని విద్యార్థినులు, ప్రిన్సిపాల్తో మాట్లాడారు. ఎమ్మెల్యేతోపాటు ప్రత్యక్షంగా విచారణ అంశాలను తెలుసుకున్న సదరు విలేకరి.. ఆయన రాసిన రాతలు తప్పు కాదని కప్పిపుచ్చుకునేందుకు మరో ఎత్తుగడ వేశాడు. వార్త ప్రచురితం కావడం వల్లే సమస్య పరిష్కారమైందని, విద్యార్థినులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడకుండానే వారి పేరిట వార్త రాసి ఇంకో తప్పు చేశాడు. ఆదివారమే సమస్య పరిష్కారమైతే.. సోమవారం వార్త ప్రచురితమయ్యాక అధికారులు స్పందించి నీటి కొరత తీర్చారని కప్పి పుచ్చుకోవడం వెనుక మతలబు ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రతిపక్షాల నాయకులతో ఫోన్లో మాట్లాడి, వాట్సాప్లో వార్త కథనాలను పంపించి పాఠశాలను సందర్శించేలా సదరు విలేకరి ప్రేరేపిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయన మాటలు నమ్మి పాఠశాలకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులకు స మస్య లేదని తెలుసుకొని ఏం చేయాలో పాలుపోక విద్యార్థినులకు మోటివేషన్ క్లాస్లు తీసుకున్నారు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన సదరు నేతలు విలేకరిని ఛీదరించుకుంటున్నారు. అనవసరంగా తమను ఎందుకు బదలాం చేస్తున్నావని హెచ్చరించారు. ఇలా తన జిత్తులమారి ఎత్తులు పారకపోవడంతో అచేతన స్థితికి చేరుకున్నాడు.
నాతో అస్సలు మాట్లాడలేదు..
పాఠశాలలో నీటి సమస్య గురించి ఆంధ్రజ్యోతి విలేకరి నాతో మాట్లాడ లేదు. కల్పిత కథనం రాశారు. పేపర్లో వార్త వచ్చిన ముందురోజే స మస్య పరిష్కారమైంది. అది తెలియకుండా గందరగోళ వార్త రాసి అందరినీ అయోమయానికి గురిచేశాడు. సదరు విలేకరి ఆదివారం పాఠశాలకు వచ్చినట్లు సమాచారం ఉన్నది. పత్రిక యాజమాన్యాలు కూడా నిజానిజాలు గమనించి వార్తలు ప్రచురించాలి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలి. ఇప్పటివరకు మా పాఠశాలకు మంచి పేరున్నది. వంద శాతం ఫలితాలతో దూసుకెళ్తున్నాం. అన్ని రకాల సౌకర్యాలు, వసతులు ఉన్నాయి ఒక్క అసత్య వార్తతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మమ్మల్ని సంప్రదించకుండా వరుస అసత్య కథనాలు రాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు నివేదికలు అందజేస్తాం.
– దేవానందం, ప్రిన్సిపాల్, బీసీ బాలికల గురుకుల పాఠశాల, పుల్లూరు
పూర్తిగా అవాస్తవ కథనం..
‘స్నానం చేసి వారం’ అని ఆంధ్రజ్యోతి పత్రికలో వ చ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. సదరు విలేకరి నాతో మాట్లాడకుండానే.. రహస్యంగా ఫొటోలు తీసి నా పేరిట బుధవారం వార్త రాశాడు. ఇది చాలా ఆశ్చర్యం గా ఉన్నది. మా పాఠశాల, కళాశాలలో మూడు రోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సమస్య ఉండడంతో మోటర్లు పని చేయలేదు. ట్యాంకర్ల ద్వారా వచ్చిన నీటిని బకెట్లతో తీసుకెళ్లి ప్రతిరోజూ స్నానం చేసేవాళ్లం. ఆదివారం వరకే సమస్య పరిష్కారమైంది. అయినా సోమవారం నుంచి ఆంధ్రజ్యోతిలో వరుస వార్తలు వస్తున్నాయి. దీంతో మా తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలి. మా అనుమతి లేకుండా ఫొటోలతో వార్తలు రాస్తే ఊరుకోం. – సరిత, ఇంటర్ విద్యార్థిని,
బీసీ బాలికల గురుకుల కళాశాల, పుల్లూరు
ప్రతిరోజూ స్నానం చేశాం..
మూడు రోజులుగా కరెంట్ సమస్య ఉండడం తో మోటర్లు పనిచేయలేదు. అ యినా, గ్రామ పంచాయతీ ట్యాం కర్ల ద్వారా వచ్చిన నీటితో ప్రతి రోజూ స్నానం చేశాం. చదువుకునే వారు ఒక్క రోజు స్నానం చేయకుంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది వారం రోజులు ఎవరైనా ఉంటారా..? పదో తరగతి, ఇంటర్ విద్యార్థినులు ఒంటికి, రెంటికి తుప్పల్లోకి, బయటకు వెళ్తారా..? ఒక్కసారి ఆలోచించాలి. అన్ని అవసరాలు పాఠశాల ఆవరణలో ఉన్న ఉన్న బాత్రూంల్లోనే తీర్చుకున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదు.
– బి.జి.నిఖిత, ఏడో తరగతి, బీసీ బాలికల గురుకుల పాఠశాల, పుల్లూరు