వనపర్తి గడ్డ.. ప్రగతికి అడ్డాగా మారింది. ఇప్పటికే మెడికల్ కళాశాల.. సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఏకో పార్కు, పట్టణంలో రోడ్ల విస్తరణ, మినీట్యాంక్బండ్తో రూపురేఖలు మారిపోయాయి. తాజాగా రూ.669.67 కోట్లతో 24 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేరోజు పనులు ప్రారంభంకానున్నాయి. రూ.73 కోట్లతో బైపాస్ రోడ్డు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, టౌన్హాల్, లైబ్రరీ సొబగులు అద్దుకోగా.. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్పాం కంపెనీ ఏర్పాటుకు పునాదులు పడనున్నాయి.
పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా వద్ద నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంట్ తాగునీటి సరఫరాకు సిద్ధమైంది. అలాగే రూ.75 లక్షలతో నిర్మించిన రాక్ గార్డెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. మనిషి జీవితంలో ముఖ్యమైన ఆఖరి మజిలీ సాఫీగా సాగేందుకు వైకుంఠధామాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. వాటన్నింటికీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు 29న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వనపర్తికి వస్తున్నారు. మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి పర్యటనలో పాల్గొని డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాల అందజేతతోపాటు గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించ నుండగా.. జన సమీకరణలో నాయకులు నిమగ్నమయ్యారు.
– మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. తెలంగాణ ఏర్పాడ్డాక మంత్రి నిరంజన్రెడ్డి నియోజకవర్గాన్ని పోటీపడి మరీ ప్రగతి పనులు చేస్తున్నారు. వ్యవసాయ శాఖలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ కాలేజీలతో ఇప్పటికే రికార్డు సృష్టించగా.. తాజాగా జిల్లా కేంద్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
ఏకంగా రూ.666.49 కోట్లతో 24 అభివృద్ధి కార్యక్రమాలకు కే రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో జిల్లా ప్రజలకు చిరస్మరణీయ కానుకను అందిస్తున్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం ఆయిల్పాం తోటలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈమేరకు ఏకంగా ఇక్కడ ఆయిల్పాం కంపెనీని ఏర్పాటు చేశారు. ఉత్పత్తులు విక్రయించేందుకు మార్కెటింగ్కు ఇబ్బందులు కలుకుండా చేస్తున్నారు. ఐటీ టవర్, రాక్ పార్కు, దివంగత ప్రొఫెసర్ జయశంకర్సార్ విగ్రహం, ప్రత్యేక మిషన్ భగీరథ పథకం, ఇంటిగ్రేటేడ్ మార్కెట్, టౌన్హల్, లైబ్రరీ బిల్డింగ్తో దశదిశ మారుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే లేనటువంటి మోడల్ స్వర్గధామంలా వైకుంఠధామాన్ని సకల సౌకర్యాలతో నిర్మించారు.
జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తోపాటు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమళాకర్ రానుండడంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. శుక్రవారం నాటి పర్యటన నేపథ్యంలో మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పీలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. హెలిపాడ్ నిర్మాణం.. అక్కడి నుంచి మంత్రులు పర్యటించే ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేశారు. అన్ని శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఉండటంతోపాటు సాయం త్రం పాలిటెక్నిక్ కళాశాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్తో పాటు నాయకులు జనసమీకరణలో నిమగ్నమయ్యారు.
ప్రభుత్వం ఇటీవల ఆయిల్పాం తోటలను పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో చాలా చోట్ల రైతులు తోటలను సాగు చేశారు. ఇటీవలే తొలి క్రాప్ రావడంతో కంపెనీ ప్రతినిధులే వచ్చి కొనుగోలు చేశారు. భవిష్యత్లో ఆయిల్పాం తోటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో మంత్రి నిరంజన్రెడ్డి ముందుచూపుతో రైతులు మార్కెటింగ్కు ఇబ్బందులు కలుగకుండా ఏకంగా కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కొత్తకోట శివారులోని సంకిరెడ్డిపల్లి గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పునాదులు పడుతుండడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే రైతులు నేరుగా వచ్చి అమ్ముకునే అవకాశం ఉన్నది.
వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పెబ్బేరు రహదారి అధ్వాన్నంగా ఉండేది. ఇటీవల అదే రహదారికి సమీపంలో కలెక్టర్ సమీకృత కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు కావడంతో పట్టణ విస్తరణ వేగంగా సాగుతుంది. దీంతో ఈ రహదారి విస్తరణ పనులకు రూ.48.50 కోట్లతో శ్రీకారం చుట్టారు. దీంతో వనపర్తి నుంచి నేరుగా జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పడింది. కొత్తకోట, వనపర్తి రహదారిని కలెక్టరేట్, మెడికల్ కాలేజీలను అనుసంధానిస్తూ రూ.73 కోట్లతో బైపాస్ రహదారిని నిర్మిస్తుండడంతో పట్టణంలోకి వెళ్లకుండా ఇటు జిల్లా కార్యాలయాలకు.. అటు పెబ్బేరు రహదారికి అనుసంధానం చేస్తున్నారు. పట్టణ విస్తరణ శరవేగంగా జరుగుతుండడంతో ఊహించని విధంగా అభివృద్ధి చెందుతున్నది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుండటంతో పాటు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా వివిధ కళాశాలలకు హాస్టల్ వసతి కోసం నిర్మాణాలు చేపడుతున్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.కోటీ 25 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం ప్రత్యేకంగా నిలిచింది. ఉమ్మడి జిల్లాలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ నిర్మించారు. పట్టణానికి స్వర్గధామంగా తీర్చిదిద్దారని పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ ఖననాలు చేస్తుండంటో ప్రభుత్వం స్థలాలు ఇచ్చి ధామాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నది. అయితే ఇక్కడ నిర్మించిన వైకుంఠధామం సకల సౌకర్యాలు నిర్మించారు. రూ.75లక్షలతో నిర్మించిన రాక్ గార్డెన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఇందులో ప్రొఫెసర్ జయశంకర్సార్ విగ్రహాన్ని ఏ ర్పాటు చేశారు. జంతువులకు కూడా ప్రత్యేకంగా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం తో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ వనపర్తి పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. వచ్చే నెలలో షెడ్యుల్డ్ వెలువడే అవకాశం ఉన్నందునా బీఆర్ఎస్ నేతలు ఉత్సహంగా ఉన్నారు. వనపర్తి గడ్డ నుంచి కేటీఆర్ ఎన్నికల శంఖరావం పూరించే అవకాశం ఉండటంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. అక్టోబర్ 1వ తేదీన ప్రధాని మోదీ మహబూబ్నగర్ వస్తున్నారు. అంతకుముందే కేటీఆర్ మోడీని ఉద్దేశించి అనేక ప్రశ్నలకు సంధించే అవకాశం ఉండటంతో రాజకీయ వేడిని రగిలిస్తుందని విపక్షాలు అంటున్నాయి. పాలమూరుకు జాతీయ హోదా.. ప్రత్యేక ప్యాకేజీలు, ప్రధాని అవాస్ యెజన ఎక్కడుందని ప్రజల తరఫున కేటీఆర్ నిలదీస్తుండడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది.