వనపర్తి, మార్చి 25 : తెలంగాణలో సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు కట్టపై శనివారం లబ్ధిదారుల దరహాసం, సంక్షేమ జాతర సాగింది. 732మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు 543మందికి రూ.కోటీ 90లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి నిరంజన్రెడ్డి పంపిణీ చేశారు. అలాగే 239మం ది క్షయ వ్యాధిగ్రస్తులకు మంత్రి సొంత ఖర్చుతో ప్రతినెలా అందించే పౌష్టికాహార కిట్లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, న్యూట్రిషన్ కిట్, రైతుబంధు తదితర పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని అన్నివర్గాలకు ప్రభుత్వం సమప్రాధా న్యం ఇస్తున్నదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రంజా న్ పర్వదినాన్ని పురస్కరించుకొని తాళ్లచెరువు కట్టపై ముస్లింలకు ఇఫ్తార్విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, దసరాకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అందరూ కలిసిమెలిసి ప్రగతి సాధించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్వో సాయినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.