ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్, ఖిల్లాఘణపురం మండలాల్లో పర్యటించారు. రంగ సముద్రంలో ఏర్పాటు చేసిన బోటింగ్లో విహరించారు. పెబ్బేరు లో పశువైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. పశు వైద్యం చదివితే అన్ని జీవరాశులకు వైద్యం చేయొచ్చన్నారు. వ్యవసాయం తర్వాత పశుపోషణకే ప్రాధాన్యత ఉంటుందన్నారు.రైతులకు అండగానిలుస్తున్నామన్నారు.
శ్రీరంగాపూర్, జనవరి 25: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం మండలకేంద్రంలోని రంగసముద్రంలో టూరిజం బోటు, రూ.40 లక్షలతో నిర్మించిన సింగిల్విండో గోదాం, రూ.31 లక్షలతో నిర్మించిన మండల వనరుల కేంద్రం భవనం, రూ.3.35 కోట్లతో నిర్మించిన కస్తూర్చాగాంధీ పాఠశాల భవనాన్ని మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శనీయ స్థలాలు, పర్యాటక కేంద్రాలు చాలా ఉన్నాయని, వాటి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటికే యాదాద్రి క్షేత్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కుతున్నదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై కూడా దృష్టి పెట్టి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఒకటి, రెండు రాష్ర్టాల్లో మినహా మిగతా చోట్ల మనవద్ద ఉన్నన్ని వసతులు లేవన్నారు.
విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని కోరారు. సాగునీటి రాకతో ప్రతి ప్రాజెక్టు, చెరువులు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దబడ్డాయని, పంటలు కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి, సింగిల్విండో చైర్మన్ జగన్నాథంనాయుడు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడ్నాయక్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాజలాలతో గ్రామాలన్నీ సస్యశ్యామలంగా మారాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని ఆగారం గ్రామంలో రూ.21 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే రూ.24 లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజారోగ్యం మేరకు మూడు, నాలుగు గ్రామాలకు కలిపి పల్లె దవాఖాన నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విడుతల వారీగా సీసీ రోడ్లు, మురుగు కాలువలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. మండలంలో సెంటు భూమి కూడా మిగలకుండా సాగు జరుగుతున్నదన్నారు. రైతులు వరిపైనే కాకుండా ఇతర పంటలపై కూడా దృష్టి సారించాలన్నారు. గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, మురుగు కాలువలు, యూత్ బిల్డింగ్ల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెడ్ల చెరువులో తూము మరమ్మతులకు నోచుకోకపోవడంతో చెరువులోని నీరు వృథా అవుతుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
మరమ్మతు పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకొస్తే వెంటనే తన నిధుల నుంచి నిధులు మంజూరు చేస్తానని సింగిల్విండో చైర్మన్, కాంట్రాక్టర్ మురళీధర్రెడ్డితో చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సర్పంచులు శేఖర్రెడ్డి, వెంకటరమణ, పీనానాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.