నాగర్కర్నూల్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నీళ్లు, నిధులతోపాటు వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. జిల్లాలుగా ఏర్పడడం మరింత కలిసొచ్చింది. ఇందులో భాగంగా జిల్లాకు ఓ మెడికల్ కళాశాల ఏర్పాటవగా, అనుబంధంగా తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రం ఏర్పడటం విశేషం. దీనివల్ల పేదలకు దాదాపుగా 134రకాల వైద్య పరీక్షలను ఉచితంగానే అందిస్తారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ డయాగ్నోస్టిక్ కేంద్రం పనులు తుది దశలో ఉండటంతో త్వరలో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో టీ-డయాగ్నొస్టిక్ కేంద్రం త్వరలో ప్రారంభం కానున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత జూన్లో రాష్ట్రవైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఈ కేంద్రాలను పలు జిల్లాల్లో ఈ కేంద్రాలు ప్రారంభించారు. నాగర్కర్నూల్లోనూ నిర్మించిన డయాగ్నోస్టిక్ కేంద్రం భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ కేంద్రం ద్వారా తొలుత 57రకాల వైద్య పరీక్షలను మాత్రమే చేయడం జరిగింది. అయితే వైద్యరంగంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ, పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఈ పరీక్షలను 134కు పెంచడం గమనార్హం.
ఈ కేంద్రంలో ఖరీదైన పరీక్షలన్నీ పూర్తిగా ఉచితంగానే చేయడం జరుగుతుంది. ఇందులో అందించే పరీక్షలతో ప్రైవేట్ ల్యాబుల్లో రూ.500నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతాయి. దీనివల్ల పేదలకు వేలాది రూపాయల ఆర్థికభారం తప్పుతుంది. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ పరీక్షకు ప్రైవేట్ ల్యాబుల్లో రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే తలసేమియా, హీమోఫీలియా, అనీమియా, హెచ్ఐవీ, వైరల్లోడ్లాంటి టెస్టులూ ఈ కేంద్రం ద్వారా చేస్తారు. అదేవిధంగా రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్రేలతోపాటు గుండె పరీక్షలైన ఈసీజీ టూడీ ఈకో కూడా చేస్తారు.
దీనివల్ల అత్యవసర సమయాల్లో ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు. ప్రభుత్వ దవాఖానలో 24గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండటం వల్ల గుండె, ఇతర సమస్యలుంటే వెంటనే ఈ పరీక్షలు చేసి అత్యవసర చికిత్సలు కూడా అందించేందుకు వీలవుతుంది. వీటితోపాటు క్యాన్సర్ నిర్ధారణ చేసే మమ్మోగ్రామ్ పరీక్షలు కూడా ఈ ల్యాబ్లో జరగనుండటం ప్రత్యేకం. గతంలో క్యాన్సర్ పరీక్షలంటే హైదరాబాద్కు మాత్రమే వెళ్లాల్సి ఉండేది. త్వరలో ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే గుండె, క్యాన్సర్లాంటి పరీక్షలూ టీ డయాగ్నోస్టిక్ కేంద్రంలోనే చేసేందుకు వీలుంటుంది. ఇందులో చేసే సాధారణ పరీక్షల ఫలితాలను కేవలం 24గంటల్లోనే అందించడం జరుగుతుంది. ప్రభుత్వ దవాఖానల్లో ఈ రోజు పరీక్షకు వైద్యులు చీటీ రాస్తే రెండు రోజులు పట్టే సమయం స్థానంలో ఒక్క రోజులోనే వస్తాయి. దీనివల్ల దవాఖానకు వచ్చిన రోగి అదే రోజు పరీక్షలు చేయించుకొని మందులు రాయించుకొని ఇంటికి వెళ్లవచ్చు. ఫలితంగా వ్యాధులను ప్రాణాంతకంగా మారకముందే తొలుతే గుర్తించడానికి వీలవుతుంది.
నాగర్కర్నూల్ డయాగ్నోస్టిక్ కేంద్ర భవన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. పరీక్షలు చేసే యంత్రం కూడా జిల్లా జనరల్ దవాఖానకు చేరింది. ప్రత్యేక క్రేన్ సాయంతో ఈ యంత్రాన్ని ఉయ్యాలవాడ వద్ద మెడికల్ కళాశాల పక్కన నిర్మించిన డయాగ్నోస్టిక్ కేంద్రానికి తరలించనున్నారు. హైదరాబాద్ నుంచి నిపుణులను రప్పించేందుకు అధికారులు సమాచారం అందించారు. రాబోయే రెండు వారాల్లో ఈ యంత్రాన్ని బిగించనున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవంలో జాప్యం కలుగుతోంది. అయితే ప్రజల కోసం అధికారులచే వచ్చే నెలలో ఈ కేంద్రం సేవలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తమ్మీద ఈ టీ-డయాగ్నోస్టిక్ కేంద్రం అందుబాటులోకి వస్తుండటంతో పేద ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
టీ-డయాగ్నొస్టిక్ కేంద్రం ద్వారా 134 వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. జిల్లా దవాఖానలో పరీక్ష యంత్రం వచ్చింది. హైదరాబాద్ నుంచి నిపుణులను తీసుకొచ్చి ప్రత్యేక క్రేన్ ద్వారా డయాగ్నస్టిక్ కేంద్రానికి తరలించి బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెలలో ఈ కేంద్రం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. ఈ కేంద్రంలో పరీక్షలు 24గంటల్లోనే రావడంవల్ల రోగులకు వెంటనే మందులు, చికిత్సలు అందుతాయి.