వనపర్తి, మార్చి 15 : జిల్లాలోని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జెడ్పీ సీఈవో యాదయ్యతో కలిసి డీఆర్డీవో, డీపీవో శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో చేతి పంపులు, బోరు బావులకు సంబంధించి మరమ్మతులుంటే ఈనెల 18 తేదీలోగా పూర్తి చేయాలన్నారు. పంపు సెట్ల మరమ్మతుల కోసం నిధులు అవసరమైతే మండల ఇంజినీర్ల ద్వారా అంచనా తయారు చేసి పంపాలని సూచించారు.
జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు సహా పలు మండలాల్లో ఉపాధి కూలీల హాజరు శాతం తక్కువగా ఉందని, దానిని మెరుగు పర్చే దిశగా సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రతి రోజూ ఉదయం 8గంటలకు ఏపీవోలు ఇతర సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి కూలీలను పెంచే విధంగా పనిచేయాలన్నారు. అలాగే పెద్దమందడి, శ్రీరంగాపురం,వనపర్తి, పాన్గల్ మండలాల్లో ఇంటి పన్ను సేకరణ సోమవారం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో ఉమాదేవి, డీపీవో రమణ మూర్తి, డిప్యూటీ సీఈవో రామమహేశ్వర్, డీఎల్పీవో రఘునాథ్రెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.