మాగనూరు : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్ దొడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 68 లో 36 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ ( Government Land ) భూమి ఆక్రమణకు గురైందని జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపకులు వాకిటి అంజనేయులు ముదిరాజ్ ( Anjaneyulu Mudiraj ) ఆరోపించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు గురువారం వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రికార్డుల ప్రకారం సదరు భూమి ఆన్లైన్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యవసాయ సాగు జరగడం లేదని తెలిపారు. అధికారిక పంచనామా నిర్వహిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
భూమి సాగులో లేనప్పటికీ, కొందరు వ్యక్తులు అక్రమంగా రైతు భరోసా, పీఎం కిసాన్ , రైతు బీమా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా పొందిన వ్యక్తుల పట్టాలను తక్షణమే రద్దు చేసి, ఆ భూమిని ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకోవాలని కోరారు.