జడ్చర్లటౌన్, డిసెంబర్ 8: పదోతరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య ఘటన కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ మహేశ్ చెప్పారు. బాలిక ఆత్మహత్య చేసుకునేలా భయభ్రాంతులకు గురిచేసిన నిందితులపై పోక్సోయాక్ట్, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం జడ్చర్ల పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. ఈనెల 2న రాత్రి బాలానగర్ మండలం తిర్మలగిరి పంచాయతీ పరిధిలోని కేశ్యానాయక్ తండాలో పదోతరగతి చదువుతున్న మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా, అదే మండలంలోని చిన్నరేవల్లి గ్రామానికి చెందిన డిష్ ఆపరేటర్ శనమోని శివ అనే యువకుడు సదరు బాలిక ఇంటికొచ్చాడు.
బాలికతోపాటు శనమోని శివ అనే యువకుడు బాలిక ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తించిన అదేతండాకు చెందిన నేనావత్ శ్రీనివాస్ అలియాస్ డబ్బా శ్రీను, నేనావత్ శ్రీనివాస్ అలియాస్ అడ్వకేట్ శ్రీను, తిర్మల్గిరి గ్రామానికి చెందిన సింగపోగు సుదర్శన్ కలసి బాలిక ఇంటి వద్దకెళ్లి శివను బెదిరించి అతడి వద్దనున్న సెల్ఫోన్ను లాక్కున్నారు. అతడి ఫోన్ నుంచి బాలిక ఫోన్కు చాటింగ్ చేసి, ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పి కులపంచాయితీ పెడ్తామని నిందితులు బాలికను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బాధితురాలు ఈనెల 3న ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
బాలిక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానలో ఫోరెనిక్స్ ప్రొఫెసర్ల సమక్షంలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ చెప్పారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కు నిందితులుగా నేనావత్ శ్రీను, అడ్వకేట్ శ్రీను, శనమోని శివ, సింగపోగు సుదర్శన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈక్రమంలో గురువారం ఉదయం తిర్మలగిరి గ్రామానికి చెందిన ఎంపీటీసీ నేనావత్ వెంకట్రాంనాయక్ సమక్షంలో నలుగురు నిందితులు జడ్చర్ల రూరల్ పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. బాలికపై లైంగికదాడికి పాల్పడినట్లు ఫోరెనిక్స్ ల్యాబ్ రిపోర్టు వస్తే వాటి ఆధారంగా కేసులో మరికొన్ని సెక్షన్లు చేరుస్తామని చెప్పారు. అదేవిధంగా బాలిక మృతిచెందిన ఘటనపై జరిగిన ఆందోళనలు, రాస్తారోకోలపై వేర్వేరుగా నాలుగు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప, బాలానగర్ ఎస్సై జయప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.