మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 28 : రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లా ఏసీబీ రేంజ్ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం బండమీదిపల్లిలోని మహబూబ్నగర్ జిల్లా ట్రాన్స్పోర్టు కమిషనర్ (రవాణా శాఖ) కార్యాలయంలో డీఎస్పీ కృష్ణగౌడ్ తన సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో బయటి వ్యక్తులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పా రు. అందుకే కార్యాలయంలో అన్ని విభాగాల దస్ర్తాలు, ఫైల్స్ను పరిశీలించి తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రైవేట్ వ్యక్తులైన లతీఖ్, అతీఖ్ అనే ఇద్దరు ఏజెంట్లను పట్టుకోవడం జరిగిందన్నారు.
అలాగే డ్రైవింగ్ ట్రాక్ వద్ద రమేశ్ అనే వ్యక్తి వచ్చి కారు అద్దెకు పెట్టి టెస్టు డ్రైవింగ్కు వచ్చిన వారితో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించి అతడిని కూడా రెడ్ హ్యండేండ్గా పట్టుకున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులు కూడా నగదు బదిలీలు అనుమానస్పదంగా ఉండడంతో వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రవాణాశాఖ కార్యాలయంలో ఎవరైనా లైసెన్స్, రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు అడిగితే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో ఓ సీనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్తోపాటు 10మంది ఉద్యోగులను విచారించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి నగదు పట్టబడలేదని, శాఖాపరంగా జరిగిన లావాదేవీలకు సంబంధించిన డబ్బులు అంతా సక్రమంగా ఉన్నాయని వివరించారు.