మహ్మదాబాద్, జూలై 31 : ఏసీబీ వలకు అ వినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఈ పనులను గతేడాది మా ర్చిలో పూర్తి చేయగా.. బిల్లులను చెక్కు రూపేణా సువర్ణకు పంచాయతీ కార్యదర్శి పాండురంగం అందజేశారు. కాగా, బిల్లులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి డిమాం డ్ చేశాడు. ఈ క్రమంలో సువర్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాండురంగానికి సువర్ణ రూ.9వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విచారణ చేపట్టారు. పాండురంగంను మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ బి.శ్రీకృష్ణాగౌడ్, ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ఏఎస్కే జిలానీ, అధికారులు ఉన్నారు.