వీపనగండ్ల, మార్చి 21 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప థకం ద్వారా ఉమ్మడి వీపనగండ్ల మండలంలో 12 ఏండ్ల నుంచి దా దాపు 1,500 మంది రైతులు.. 3,500 ఎకరాల్లో మామిడి తోటల ను సాగుచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ప్ర త్యేక శ్రద్ధ వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నది. దీంతో బీడు భూముల్లో తోటలు పెంచేందుకు రైతన్నలు ముందుకొస్తున్నారు. ఉమ్మడి వీపనగండ్ల మండలంలో దాదాపు 3,500 ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు. ఉపాధి హామీ పథకం కిం ద గుంతలు తీయడం, మొక్కలు నాటడం, నీరు పెట్టడం వంటి పెట్టుబడి ఖర్చుల కోసం ఎకరాకు ప్రతి నెలా రూ.1500 చొప్పున మూడేండ్లపాటు రైతుల బ్యాంక్ ఖాతాలో జమచేస్తున్నారు. దీంతో రైతులు మామిడి తోటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎకరా పొలంలో 70 నుంచి 80 మామి డి మొక్కలను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మొక్కలు నాటినప్పటి నుంచి మూ డేండ్లపాటు వేరుశనగ, మినుమలు వంటి అం తర పంటలను సాగు చేసుకోవచ్చు. మొక్కలు నా టిన ఐదేండ్ల తరువాత తోట కాపునకు వస్తుంది.
హైదరాబాద్ మార్కెట్లో ఉమ్మడి వీపనగండ్ల మండలానికి చెందిన మామిడిపండ్లు, కాయలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. దీంతో రైతులు, కూలీలు, వాహనదారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఎకరా కు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ఉమ్మడి మండలంలో పండుతున్న మామిడి ద్వారా రూ.17 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు లాభాలు గడిస్తున్నట్లు అంచనా. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడకపోవడంతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆశించిన స్థాయిలో బడ్జెట్ కేటాయించకపోవడం, ఆధార్లింక్ వంటి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడంతో సిబ్బంది, కూలీలు, రైతులు నిరాశకు గురవుతున్నారు.
సులభంగా కుటుంబపోషణ..
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పదేండ్ల కిందట 3.5 ఎకరాల్లో మామిడి మొక్కలు నాటాను. అప్పటినుంచి మూడేండ్లపాటు పెట్టుబడి ఖర్చులయ్యాయి. అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు పాటిస్తూ మొక్కలను పెంచాను. ఐదేండ్ల నుంచి మామిడి తోట కాపునకు వస్తున్నది. తోట నుంచి వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ సులభమైంది. ఉపాధి హామీకి సంబంధించిన బడ్జెట్ను పెంచి రైతులకు ఎక్కువ మార్గాల్లో ఉపయోగపడేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
– ఎత్తం వెంకటేశ్, వీపనగండ్ల
మామిడి తోటపై పెరిగిన ఆసక్తి ..
పదేండ్ల కిందట మండలంలో కాల్వల ద్వారా నీటి సరఫరా తక్కువగా ఉండేది. ఈ క్రమంలో బీడు భూముల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మామిడి మొక్కలను నాటేందుకు రైతులు ఆసక్తి కనబరిచారు. బోరు గుంతలు తవ్వి డ్రిప్ సిస్టం ద్వారా నీటిని పొదుపుగా వాడి తోటలను పెంచేవారు. ప్రస్తుతం మామిడి పంటను వాణిజ్యపరంగా మార్చుకొని రైతులు ఆర్థికంగా బలపడుతున్నారు.
– శేఖర్గౌడ్, ఏపీవో, వీపనగండ్ల