మహబూబ్నగర్ టౌన్, జనవరి 18: జిల్లాకేంద్రంలోని అబ్దుల్ ఖాదర్ షా ఉర్సు 21 నుంచి ప్రారంభంకానున్నది. 84వ ఉర్సును పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దర్గాలో ప్రతియేటా నిర్వహించే ఉర్సు వేడుకలో కుల, మతాలకతీతం గా ప్రజలు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. అబ్దుల్ ఖాదర్ షా అనే వ్యక్తి ఓ పోలీ స్ కానిస్టేబుల్.. 1929లో కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుంచి మహబూబ్నగర్కు వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు ముస్లిం మతపెద్దలు చెబుతారు. విధులు నిర్వర్తిస్తూనే దైవచింతన, ఆధ్యాత్మిక భావనతో ప్రజలను చేరదీసేవారన్నారు.
ఉద్యోగ విరమణ అనంతరం జిల్లాకేంద్రంలోని రాయిచూర్ రోడ్డులో ఓ చెట్టు కింద కూర్చొని ప్రజలకు హితబోధ చేసేవారని పేర్కొన్నారు. ప్రతి గురు, శుక్రవారం చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఖాదర్ షా వద్దకు వచ్చి తమ బాధలు, సమస్యలు విన్నవించుకునేవారు. ఆయన సామరస్యంతో పరిష్కార మార్గం చెప్పేవారని తెలిసిందన్నారు. ఖాదర్ షా మరణానంతరం ఆయన కుటుంబసభ్యులు రాయిచూర్ రోడ్డు పక్కనే నిర్మించిన ఆయన సమాధిపై దర్గాను ఏర్పాటుచేశారు. అప్పటినుంచి కుల, మతాలకతీతంగా ప్రజలు దర్గాను దర్శించుకుంటారు. దర్గా అభివృద్ధిపై మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టి సారించి రూ.50లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
అబ్దుల్ ఖాదర్ షా దర్గా ఉత్సవాలు 21వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభంకానున్నాయి. 21న జలాభిషేకం(గుసూల్ షరీఫ్), 22న సాయంత్రం 4గంటలకు గంధోత్సవం షేక్ బడేసాబ్ ఇంటి నుంచి బయలుదేరి అశోక్టాకీస్ చౌరస్తా, ఎస్బీహెచ్ రోడ్డు, తూర్పుకమాన్, పోలీస్ క్లబ్ నుంచి వన్టౌన్ చౌరస్తా గుండా దర్గాకు చేరుకుంటుంది. అక్కడ చాదర్లు సమర్పించి ఫతేహాలు అందజేస్తారు. వారం రోజులు నిర్వహించే వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ముంబాయి, హైదరాబాద్, రాయిచూర్ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలొస్తారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఉర్సులో కర్ణాటక ప్రసిద్ధ గుల్బర్గా షరీఫ్ దర్గాకు చెందిన పీఠాధిపతి హజ్రత్ సయ్యద్ హిదాయతుల్లా బాదేషా ఖాద్రీ అల్ బాగ్దాదితోపాటు ప్రముఖ దర్గాల పీఠాధిపతులు హాజరుకానున్నారు. రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పట్టణ ప్రముఖులు వేడుకలో పాల్గొననున్నారు.
ఉర్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం. కరోనా నేపథ్యంలో భక్తులు నిబంధనలు పాటించాలి. వేడుకకు మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ప్రముఖులు హాజరుకానున్నారు. కుల, మతాలకతీతంగా ప్రజలు దర్గాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలి.