గద్వాల, జూలై 21 : మూడురోజులుగా జిల్లాలో ముసురు వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడారు.
వర్షం కురుస్తున్న సమయంలో సెల్ఫోన్లో మాట్లాడొద్దని సూచించారు. ముసురు వర్షాల వల్ల పాత ఇండ్లు కూలే ప్రమాదం ఉన్నందున అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పాత ఇండ్లల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ముసురు వర్షాల వల్ల వాతావరణంలో మార్పులు రావడంతో ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇండ్ల వద్ద మురికి కాలువల్లో నీరు నిలువ ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మురికి కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడంతోపాటు దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉండొద్దని సూచించారు. వర్షాలు ఆలస్యంగా రావడంతో సాగు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున్న కంది, వేరుశనగ, వరి, కొర్ర, రాగులు వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.
ఈ సీజన్లో ఏ పంటలు సాగు చేయాలనే విషయమై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించామన్నారు. వర్షాల వల్ల ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిళ్ల లేదన్నారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రజలు మరమ్మతులు చేసుకోవద్దని, లైన్మెన్లకు సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయాలని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించామన్నారు. కలుషితమైన నీటిని తాగి రోగాల బారిన పడే అవకాశం ఉన్నందున కాచి వడబోచిన నీటినే తాగాలన్నారు. ముసురు వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.