రాజాపూర్, డిసెంబర్ 19: మండలకేంద్రం సమీపంలోని దుందుభీ వాగు బ్రిడ్డి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఎస్సై వెంకట్రెడ్డి, స్థానికులు కథనం ప్రకారం కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆదివారం రాత్రి బ్రిడ్జి సమీపంలో పంక్చర్ కావడంతో బస్సును బ్రిడ్జి పక్కన నిలిపారు. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ప్రైవేట్ అంబులెన్స్ను ఢీకొట్టుకుంటూ వెళ్లి అగివున్న బస్సును ఢీకొట్టింది. ఈప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు జడ్చర్ల దవఖానాకు తరలించారు.
దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న క్రమంలో ఘటన స్థలానికి వంద మీటర్ల దూరంలో మరో ప్రమాదం చోటు చేసుకున్నది. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓంశ్రీ ట్రావెల్ బస్సు డ్రైవర్ అతివేగంతో వస్తూ ముందు వెళ్తున్న మూడు కార్లను ఢీకొడుతూ మరో కారును ఢీకొట్టాడు. దీంతో కారు డీసీఎంను ఢీకొని బస్సు, డీసీఎం మధ్య చిక్కుకొని నుజ్జునుజ్జు అయింది.
ఈప్రమాదంలో కార్ల డ్రైవర్లు గాయాలతో బయటపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి గాయపడిన కారు డ్రైవర్లను చికిత్స కోసం జడ్చర్ల దవఖానకు తరలించారు. ఈరెండు ప్రమాదాలతో జాతీయ రహదారి ఒక్కసారిగా స్తంభించింది. రెండు వైపు మార్గాలపై 5కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు 5 గంటలు శ్రమించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ సైదులు, కార్ల డ్రైవర్ల ఫిర్యాదు మేరకు లారీ, ప్రైవేట్ ట్రావెల్ బస్సుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.