తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతున్నది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తోపాటు సాగునీటిని పుష్కలం చేసింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు ఆకస్మికంగా మృతి చెంది పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచి కొండంత ధీమాగా నిలిచింది. రైతుబీమా పథకంతో రైతు కుటుంబానికి కొండంత భరోసానిస్తున్నది. రైతుల తరఫున ప్రభుత్వమే ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తున్నది. ఎవరైనా మరణిస్తే వారం, పదిరోజుల్లోనే రూ.5 లక్షల సాయాన్ని వారి కుటుంబానికి అందిస్తున్నది. రైతుల నుంచి ఎంతో ఆదరణ ఏర్పడిన ఈ పథకం ప్రారంభమై నేటితో ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా కథనం..
మహబూబ్నగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకం ఎంతో మంది రైతు కుటుంబాలకు ధీమానిస్తుంది. గతంలో ఎవరైనా రైతులు ఏదైనా కారణంచే మృతి చెందినా నాటి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. పంట నష్టం.. అప్పులపాలైనా.. విద్యుదాఘాతంతో మృతి చెందినా.. ఏ ఇతర కారణాలతో మరణించినా ఆదుకోలేదు. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మృతి చెందిన రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది.
2018లో శ్రీకారం
తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులు ఏ కారణం చేతనైన చనిపోతే నామినీకి ఎల్ఐసీ తరఫున కేవలం పది రోజుల్లోనే రూ.5 లక్షలు బీమా అందేలా చర్యలు చేపట్టారు. ఈ పథకం కోసం రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమీయం డబ్బులు కూడా చెల్లిస్తున్నది. నయా పైసా చెల్లించకుండా ప్రభుత్వమే అన్నీ చూసుకొని ప్రతి ఏటా రైతులకు బీమా వర్తింపజేస్తున్నది. ఒక్కో రైతుకు ప్రభుత్వం రూ.3,556 ప్రీమియం చెల్లిస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఎందరో రైతులకు రైతుబీమా కింద ప్రయోజనం చేకూరింది. ఎన్నో కుటుంబాలకు రూ.5 లక్షలు అందించి సర్కారు అండగా నిలిచింది. అందుకే దేశంలోనే ఈ పథకం ఆదర్శంగా నిలిచింది. అయితే 2018లో రైతుబంధు సమితులను ఏర్పాటు చేసి రైతులకు, అధికారులకు సంధానకర్తలుగా చురుకుగా ఉండే వారిని ప్రభుత్వం నియమించింది. నాడే సీఎం కేసీఆర్ రైతుబీమా పథకానికి అంకురార్పణ చేశారు.
ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వందలాది మంది రైతు కుటుంబాలకు రైతుబీమాతో లబ్ధి చేకూరింది. మహబూబ్నగర్ జిల్లాలో 4,004 మంది రైతులకు రూ.202.20 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,572 మంది రైతులకు రూ.128.60 కోట్లు, నారాయణపేట జిల్లాలో 3,725 మంది రైతులకు రూ.186.25 కోట్లు, వనపర్తి జిల్లాలో 2,902 మంది రైతులకు రూ.145.10 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 4,750 మంది రైతులకుగానూ రూ.237.50 కోట్లు బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం సాయంగా అందజేసింది. కాగా ప్రభుత్వం మానవతతా దృక్పథంతో చేపట్టిన ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి కూడ ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని కొనియాడింది. ఉమ్మడి జిల్లాలోనూ రైతు కుటుంబాల్లో వెలుగులు నింపింది.
రైతు కుటుంబాలకు ఆసరా
రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏదైనా కారణంతో రైతులు మృతి చెందితే వారి కుటుంబాలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. ఎవరైనా చనిపోయిన పది రోజుల్లోనే వారి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తుండడంతో ఆయా కుటుంబాల్లో ధీమా వ్యక్తమవుతున్నది. సర్కారు సాయం అందుకున్న ఎన్నో కుటుంబాల్లో నేడు ఆర్థిక వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఆనందంగా గడుపుతున్నాయి.
పైరవీల్లేకుండా.. నయా పైసా చెల్లించకుండా..
గతంలో ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా దరఖాస్తు చేసే దగ్గర్నుంచి.. మంజూరయ్యే వరకు ఆమ్యామ్యాలు చెల్లించాల్సి వచ్చేది. పరిహారం వచ్చినా రైతు చేతికి ద క్కాలంటే మళ్లీ లంచం ఇవ్వాల్సిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పైసా ఇవ్వకుండా పథకాలు అర్హుల కు అందించేందుకు చర్యలు చేపట్టింది. దరఖాస్తు మొద లు.. తర్వాత ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాల్సి వస్తుంది. దీంతో పక్కదారి పట్టడానికి ఆస్కారమే లేకుండాపోయిం ది. రైతుబీమా పథకం ఎందరో కర్షక కుటుంబాల్లో ఆర్థిక ధీమానిచ్చింది. 18 ఏండ్ల నుం చి 59 ఏండ్ల రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆధార్లో పుట్టిన తేదీ ఆధారంగా వయస్సు నిర్ధారణ చేసి బీమా పథకానికి అ ర్హులుగా గుర్తించిన వారికి వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమతి సభ్యులు బీమా చేయిస్తారు. ఎకరా నుంచి వంద ఎకరాల వ రకు భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. రైతులు నామినీని ఎంపిక చేసుకుని వారి ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్ను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత రైతు ఏదైనా కారణంతో మృతి చెందిందే వారు నామినీగా పేర్కొన్న వారికే ప్రభుత్వం రూ.5 లక్ష లు అందజేస్తున్నది. దీంతో రైతు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
‘బీమా’తోనే ఇల్లు కట్టుకున్నా..
నా పేరు సాబేరాబేగం. మాది మూసాపేట మండలం జానంపేట గ్రామం. నా భర్త ఎండీ అనీఫ్ అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామ పెద్దలొచ్చి ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు రైతుబీమా వచ్చిందని చెప్పి ఎమ్మెల్యే సార్తో నాకు చెక్ ఇప్పించారు. బీమాతో నా భర్త వైద్యం కోసం చేసిన అప్పును తీర్చిన. మాకు ఉండడానికి ఇల్లు లేకుండే. మిగతా డబ్బుతో చిన్న రూం కట్టుకొని రేకులు వేసుకుని అందులోనే ఉంటున్నా. బీమా డబ్బులు రాకుంటే నేను, నా పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లం. రైతుబీమానే మా కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకున్నది. అందుకు కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– సాబేరా బేగం, జానంపేట గ్రామం.
ఇలాంటి పథకం మరెక్కడా లేదు
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుబీమా, రైతుబంధుతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. సాగునీరు, ఉచిత కరెంట్, ఎరువులు, విత్తనాలు అన్ని సకాలంలో అందింస్తుండడంతో రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. ప్రమాదవశాత్తు మాత్రమే చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించి ఆదుకుంటున్న గొప్ప సీఎం కేసీఆర్. ఆయన విజన్ ఉన్న నేత.. రైతులకు, వారి కుటుంబాలకు ఇంత మేలు చేసిన వ్యక్తి మరెవ్వరూ లేరు. రైతుబీమా పథకాన్ని వర్తింప జేయడం.. ఆలోచన చేయడమే గొప్ప సంకల్పం. గతంలో రైతుల గురించి మాట్లాడారే తప్పా వారిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు.
– లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే