మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 29 : పట్టణాభివృద్ధితోపాటు క్రీడలపై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో క్రీడామైదానాలు శరవేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈక్రమంలో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఇండోర్ స్టేడియం కల నెరవేరింది. మంత్రి చేతుల మీదుగా శనివారం స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాకేంద్రానికి తలమానికంగా నిలిచేలా అధునాతన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని రూ.7కోట్ల79లక్షలతో పూర్తి చేశారు.
సెంట్రలైజ్డ్ ఏసీ కండీషన్, అధునాతన సౌండ్ సిస్టమ్, ప్రత్యేక ఫ్లోరింగ్ను ఏర్పాటు చేశారు. ఇందులో బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, నెట్బాల్, కబడ్డీ, ఖోఖో క్రీడలు నిర్వహించుకోవచ్చు. ప్రేక్షకుల కోసం ఇండోర్ గ్యాలరీ రెండు వైపులా ఏర్పాటు చేశారు. జాతీయ,అంతర్జాతీయస్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దేలా, జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించేలా ఈ స్టేడియం నేటి నుంచి అందుబాటులోకి రానుంది.
మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవంలో భాగంగా నేడు జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్వో శ్రీనివాస్ తెలిపారు. డబుల్స్, మెన్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పోటీలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని చెప్పారు. స్టేడియం ప్రారంభోత్సవంలో కలెక్టర్ రవినాయక్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.