వనపర్తి జిల్లాలో తొమ్మిది ఆయుష్ వెల్నెస్ కేంద్రాలు
రూ.54 లక్షలతో సెంటర్ల నిర్మాణాలు
ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, యోగా సాధన
వ్యాధులు ఎలా నయం చేసుకోవాలనే విధానంపై శిక్షణ
వనపర్తి రూరల్, జూన్ 24 : అసంక్రమిత వ్యాధుల కారణంగా శారీరక రుగ్మతల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆయుష్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు వనపర్తి జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వెల్నెస్ కేంద్రాలను ప్రారంభించి వైద్యులు ప్రజలకు రోగాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ఆహారం, యోగా, ఇతర పద్ధతులపై వైద్యులు సూచనలిస్తున్నారు. విద్యాసంస్థలు, కాలనీలు, ప్రభుత్వ కా ర్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా హెల్త్ వెల్నెస్ కేంద్రాల్లో యోగా షెడ్ల నిర్మాణాలకు శ్రీ కారం చుట్టారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో దవాఖానలకు రాకుండా వంటింటినే వైద్యశాలగా మార్చుకోవచ్చని, దినుసులతో తయారుచేసిన మిశ్రమాలతో, పెరట్లో లభించే ఔషధ మొక్కలతో వ్యాధులు నయం చేసుకోవచ్చనే విషయాలపై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు.
యోగా షెడ్లలో సౌకర్యాల కల్పన..
వనపర్తి జిల్లాలో ఎంపిక చేసిన 9 హెల్త్ వెల్నెస్ కేంద్రాల్లో టీఎస్ ఎంఐడీఎస్ ద్వారా షెడ్లను నిర్మించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఆదేశాలు జారీ చేశారు. ఆయా వైద్యశాలలకు మంజూరైన నిధుల నుంచి యోగా షెడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వాటిలో పెబ్బేరు, పెద్దమందడి, వనపర్తి మండలం పెద్దగూడెం, రేవల్లి మండలం నాగపూర్లో వెల్నెస్ సెంటర్ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆత్మకూరు, అజ్జకొల్లు, ఖిల్లాఘణపురం, కల్వరాల, గోపాల్పేటలో పనులు జరుగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి దాదాపుగా రూ.6 లక్షలు వెచ్చించారు.