వనపర్తి, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) :గోపాల్పేట మండలం మున్ననూరుకు చెందిన బాలరాజుకు మూడెకరాలు ఉన్నది. ఇదంతా గుట్టల ప్రాంతంలోనే ఉంటుంది. ఇందులో అష్టకష్టాలు పడి సాగుచేస్తే 20 బస్తాల వరి మాత్రమే పండేది. అయితే, ఎత్తు ప్రాంతాలకు నీరందించేందుకు గత ప్రభుత్వం లిఫ్ట్లను ఏర్పాటు చేసింది. దీంతో నాలుగేండ్ల నుంచి మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని ఏటా రూ.8లక్షల దిగుబడి వచ్చేలా వరి, రూ.12లక్షల లాభంతో వేరుశనగ పంటలను పండిస్తున్నాడు. లిఫ్ట్ ఏర్పాటు చేయకముందు పొట్టకూటి కోసం వలసబాట పట్టిన బాలరాజు నేడు సంబురంగా సాగు చేసుకుంటున్నాడు. ఈ వానకాలం సీజన్లో 120 క్వింటాళ్ల ధాన్యం పండించగా.. వాటిని విక్రయిస్తే రూ.2.37 లక్షల డబ్బులు వచ్చాయి.
మున్ననూరుకు చెందిన నరసింహ పొలం చినపోలిగుట్టను అనుసరించి ఉన్నది. ఆయనకున్న పొలానికి తోడు మూడెకరాలు కౌలుకు తీసుకొని మొత్తం ఐదెకరాల్లో వరివేయగా.. 138 క్వింటాళ్ల ధాన్యం పండింది. వాటిని అమ్మగా రూ.3.36 లక్షలు వచ్చాయి. మరో నాలుగెకరాల్లో వేరుశనగ పంట వేశాడు. ఇలా వరుసగా నాలుగేండ్ల నుంచి ఏటా వరి, వేరుశనగ కలుపుకొని దాదాపు ఏడున్నర లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నాడు. రాష్ట్ర ఏర్పాటు కు ముందు వలసబాట పట్టి జీవనం సాగించగా, మినీ లిఫ్ట్తో నీళ్లు వచ్చినప్పటి నుంచి ఊర్లోనే జీవిస్తున్నాడు.
..ఇలా వనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మినీలిఫ్ట్ల కింద రై తులు సంబురంగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 77 చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయించి వాటి కింద తొమ్మిదిన్నరేండ్లలోనే పసిడి పంటలు పండేలా గత ప్రభుత్వం చొరవ తీసుకున్నది. వనపర్తి నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా.. చాలా ప్రాంతాలకు సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎత్తిపోతలల కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉన్నది. రైతులు నీరు కావాలని అడిగిన వెంటనే మినీలిఫ్ట్లు ఏర్పాటు చేయించి సాగునీరందేలా చర్యలు తీసుకొని.. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, సీఎస్ఆర్ నిధుల ద్వారా పూర్తి చేయించారు. వీటన్నింటి మూలంగా నేడు వనపర్తి సెగ్మెంట్లో ఎటు చూసినా పచ్చని పంటపొలాలే దర్శనమిస్తున్నాయి.
ఒకటి కాదు.. రెండు కాదు.. వనపర్తి నియోజకవర్గంలో ఏకంగా 77 మినీ లిప్ట్లను ఏర్పాటు చేయించి వాటి ద్వారా సాగునీరు పారించి తొమ్మిదిన్నరేండ్లలో పసిడి పంటలు పండించేలా కృషి చేశారు. ఇంతలా మినీ లిప్టుల వ్యవస్థతో వేలాది ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత రాష్ట్రంలో ఒక్క వనపర్తికే దక్కుతుంది. ఈ మినీ లిప్టుల ఏర్పాటు జరిగిన ప్రాంతమంతా అధికంగా గిరిజన తండాలు, గ్రామాలు ఉండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో మినీ లిఫ్ట్లు ఏర్పాటయ్యాయి. వనపర్తి నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. వీటిలో చాలా వరకు సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చిన ప్రాంతాలున్నాయి. ఎంజీకేఎల్ఐతోపాటు భీమా-2 ద్వారా వనపర్తి మండలంతోపాటు పెద్దమందడి, గోపాల్పేట, ఖిల్లాఘణపురం, రేవల్లి, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాలకు సాగునీరందుతుంది. అయితే ప్రధాన కాల్వల ద్వారా వీటికి సాగునీరందుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లోని భూములు ఎత్తుపల్లాలుగా ఉండటంతో అక్కడి పొలాలకు సాగునీరందని పరిస్థితి ఉండింది. ఆయా ప్రాంతాలకు మాజీ మంత్రి సింగిరెడ్డి వెళ్లినప్పుడు ఆ ప్రాంత రైతులు తమ పొలాలకు నీళ్లు కావాలని అడగటంతో ప్రత్యేక మినీ లిప్టులకు శ్రీకారం చుట్టారు. ఒక్కటితో మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా నియోజకవర్గమంతా వ్యాపించి ఎత్తుపల్లాల భూముల్లోనూ పచ్చని పసిడి పంటలకు తార్కాణమైంది.
77 మినీ లిప్టులు..
నియోజకవర్గంలోని 7 మండలాల్లో 77 మినీ లిప్టులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఏర్పాటు చేయించారు. వీటిలో ఒక్క పెద్దమందడి మండలంలోనే 26మినీ లిప్టులను ఏర్పాటు చేయగా, వనపర్తి మండలంలో 14, గోపాల్పేటలో 8, రేవల్లిలో 13, ఖిల్లాఘణపురంలో 5, శ్రీరంగాపురం మండలంలో ఒక మినీలిప్టు ఏర్పాటు చేశారు. పాన్గల్ మండలంలోనూ మరో 10వరకు మినీ లిప్టులను మంత్రి ఏర్పాటు చేయించి, వనపర్తి పరిధిలోని గుట్టల మధ్య ఉన్న కాశీంనగర్వంటి ప్రాం తాలకు సాగునీరందించా రు. ఈ మినీలిప్టులతో ఎత్తుపల్లాల భూములకు సాగునీరందించడం ద్వారా రైతు లు పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. వీటి ఆధారంగానే దాదాపు 10 వేల ఎకరాల్లో వరి, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. ఇదంతా ఈ ఐదేండ్లలోనే జరిగింది. గతంలో వేసిన బోర్లు, పంట చేతికి రాకముందే ఎండిపోవడంలాంటి పరిస్థితుల్లో కొత్త బోరు వేయాల్సిన అవసరమే లేకుండా పోయింది.
మున్ననూరులో 4 మినీలిప్టులు..
గోపాల్పేట మండలం మున్ననూరులో చినపొలిగుట్ట, ఊరగుట్ట, దేవునిగుట్ట, అడ్డవేటుగుట్ట ప్రాంతాలకు నాలుగు మినీ లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఎంజీకేఎల్ఐలోని డీ-8 కెనాల్పై మేజర్ 3-ఏ కాల్వ ద్వారా ఒక్కొక్క లిఫ్ట్లో రెండు మోటర్లు చొప్పున (15 హెచ్పీ)ఏర్పాటు చేసి నీరందించారు. ఇందుకు అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి నిరాటంకంగా ఐదేండ్లుగా పంటలకు నీరిస్తున్నారు. మున్ననూరులో 2వేల ఎకరాల భూములుంటే, వీటిలో సగం పొలాలు ఎత్తుపల్లాలు, గుట్టలను అనుసరించే ఉంటాయి. ఈ మినీలిఫ్ట్లు ఏర్పాటు చేయడం వల్ల 80శాతానికి పైగా భూములకు సాగునీరందుతున్నది. ఎటు చూసినా వరికోతలు ముగియగా, ప్రస్తుతం వేరుశనగ పంటలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగేండ్లలో గ్రామంలోని ఇద్దరు రైతులు పండించిన పంటలను లెక్కకడితే రూ.48లక్షల లెక్కకు వస్తుంది. గడచిన 50ఏండ్లను పరిశీలిస్తే ఇది ఊహించని మార్పు. గతంలో ఎంత నష్టపోయామో ఆలోచిస్తే అర్థమవుతుంది. నేడు మున్ననూరులోని ఏ గుట్ట ప్రాంతం చూసినా నీళ్ల తొక్కిసలాట ఉంది. పచ్చని పైర్లు కనిపిస్తాయి. ఇందుకు మున్ననూరు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎత్తుప్రాంతాలకు మినీ లిఫ్టులను ఏర్పాటు చేశారు.
చినపోలిగుట్ట కోటయ్యకుంటలో..
మున్ననూరులోని చినపోలిగుట్ట పొలాలను అనుసరించి కోటయ్యకుంట ఉంది. ఈ కుంటకు మేజర్ 3-ఏ కెనాల్ ద్వారా రెండు మోటర్లు ఏర్పాటు చేసి మినీ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. ఈ కుంట ప్రస్తుతం నీటితో నిండి ఉంది. మోటర్లు కూడా నడుస్తున్నాయి. వరికోతలు ముగియగా, వేరుశనగ మరో 25రోజులైతే చేతికి వస్తుంది. ఈ మినీలిఫ్ట్ ద్వారా ఒక్క కోటయ్యకుంట కిందనే దాదాపు 100 ఎకరాలు సాగవుతున్నది. ఈ ఒక్క కుంటలోనే సుమారు 20 మంది వరకు రైతులు మోటర్లు ఏర్పాటు చేసుకొని గు ట్టపైకి నీటిని తరలిస్తున్నారు. నాడు ఏడారిని తలపించిన ప్రాంతం నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నది.
రాష్ట్రంలోనే ప్రథమం..ఒక్క నియోజకవర్గంలో ఇలా ఇన్ని మినీలిఫ్ట్లను ఏర్పాటు చేయడం దాదాపు రాష్ట్రంలోనే ప్రథమంగా చెప్పవచ్చు. రైతులు నీరు కావాలని అడిగిన తక్షణమే మినీలిఫ్ట్లు ఏర్పాటు చేయించి సాగునీరందేలా మాజీ మంత్రి సింగిరెడ్డి చొరవ తీసుకున్నారు. ఈ మినీలిప్టులను ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, సీఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేయించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో మొత్తం పంటల విస్తీర్ణం, వరిపంట, నీటిపారుదల విస్తీర్ణం గణనీయమైన ప్రగతిని సాధించింది. 2014-15లో రెండు సీజన్లు కలిపి లక్షా 39,244 ఎకరాల్లో పంటల విస్తీర్ణం ఉండగా, నేడు రెండు సీజన్లు కలిపి 2లక్షల 22,650 ఎకరాలకు పెరిగింది. ఈ మేరకు 59.89 శాతం వృద్ధి చెందింది. అలాగే అప్పట్లో వరి పంట విస్తీర్ణం రెండు సీజన్లలో 38,215 ఎకరాలుంటే, ప్రస్తుతం లక్షా 72,582 ఎకరాలకు చేరి, 351.60 శాతం వృద్ధి రేటును సాధించింది. అదేవిధంగా నీటిపారుదల రంగంలోనూ 2014లో 71,292 ఎకరాల నుంచి 1,72,582 ఎకరాలకు పెరిగి, 142.07 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. వీటన్నింటి మూలంగా నేడు పసిడి పంటల వనపర్తిగా పేరు తెచ్చుకున్నది.
పుష్కలంగా నీళ్లొస్తున్నయ్..
నాలుగేండ్లుగా పుష్కలంగా నీళ్లొస్తున్నాయి. అంతకుమునుపు బోర్లు వేసి అప్పుల్లో పడ్డాం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. మా గుట్టల పొలాలకు చిన్న లిఫ్ట్లు పెట్టి నీళ్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా వస్తున్నయి. బోర్లతో పనిలేదు. పనిలేక పట్నం పోయేటోళ్లం. ఇప్పుడు మా బతుకులు మారినయి. బోర్లు ఎండటం, లోవోల్టేజీతో మోటర్లు కాలడం ఆ బాధలు తలుచుకుంటే గుండె గుబేల్ మంటది. ఇప్పుడు ఎక్కడ చూసినా పంటలే కనిపిస్తున్నయి.
– బాలరాజు, రైతు, మున్ననూరు, గోపాల్పేట
గంగమ్మ రాకతో సంబురం..
మా కోటయ్యకుంటకు గంగమ్మ వొచ్చినంక మా బతుకులు మారినయి. ఐదేండ్లకు ముందు ఒక్క చుక్క నీరులేదు. అర ఎకరం నాటినా సగం ఎండేది. రాత్రి, పగలు కష్టపడేటోళ్లం. ఇప్పుడు చాలా మేలైంది. చిన్న లిఫ్ట్లు వచ్చినంక నీళ్లు వచ్చినయ్. పంటలు బాగా పండుతున్నయ్. ఇంతకుముందు వలస పోతుంటిమి. ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నం. వరి పంట కోసినం. వేరుశనగ పంట రావాలి. నీళ్లు లేక ఎంత గోసపడ్డమో ఆ బాధలు చెప్పలేం. మా గుట్టపొలాలకు ఇట్ల నీళ్లు వస్తాయని అనుకోలే.
– నరసింహ, రైతు, మున్ననూరు, గోపాల్పేట మండలం
రెండు పంటలు పండిస్తున్నాం..
ఎత్తు ప్రాంత రైతుల పొలాలకు నీళ్లు అందించేందుకు మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పెద్దమందడి పెద్ద చెరువు నుంచి నాలుగు లైన్లు పైప్లైన్ వేసి 20 హెచ్పీ మోటర్ ద్వారా మినీ లిఫ్ట్ ఏర్పాటు చేసి దాదాపు 150 ఎకరాలు సాగులోకి వచ్చేలా చేశారు. నాకు పది ఎకరాల పొలం ఉంది. ఏడెకరాల్లో వరిసాగు చేశాను. 175 క్వింటాళ్ల పంట పండింది. ప్రస్తుతం మూడు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశా. ఇంకో నెల రోజుల్లో వేరుశనగ పంట కూడా చేతికొస్తుంది. నిరంజన్రెడ్డి సారు వల్లనే నీళ్లొచ్చి మా పొలాలు పండి సంతోషంగా సాగు చేసుకుంటున్నాం.
– పురుషోత్తంరెడ్డి, రైతు, పెద్దమందడి
నీళ్ల గోస తీరింది..
మున్ననూరుకు సాగునీటి గోస తీరింది. ఎంజీకేఎల్ఐ కాల్వలు వచ్చినా అన్ని పొలాలకు నీరు రాలేదు. మా ఊరు గుట్టల ప్రాం తంగా ఉంది. ఎటుచూసినా ఎత్తైన గుట్టలే. మాజీ మంత్రి సింగిరెడ్డి చొరవతో నాలుగు మినీ లిప్టులు ఏర్పాటు చేశాం. ప్రతి రైతు పం టలు పండిస్తున్నాడు. కరెంట్, నీళ్ల సమస్య లే దు. ధాన్యం విక్రయ సమస్య లేదు. ఇలా రై తుకు అవసరమైన అన్నిరంగాల్లో వసతులు మె రుగయ్యాయి. ఇంతలా ఎవరూ రైతుల కోసం పనిచేయలేదు.
– తిరుపతయ్య యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ,గోపాల్పేట