మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 28 : వైద్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నెంబర్వన్ సేవలను అందిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో కంటి శక్లాల తొలగింపు శస్త్ర చికిత్స కోసం రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్యాకో మిషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో 165 ఐసీయూ బెడ్లు, 550 ఆక్సిజన్ బెడ్లు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ బెడ్లను ప్రజలకు అందుబాటులో ఉంచి మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ జీవన్, ఇన్చార్జి డీఎంహెచ్వో భాస్కర్, కౌన్సిలర్ నీరజ, జీజీహెచ్ ఆడ్వైజర్లు లక్ష్మి, సత్యం యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, గణేశ్ యాదవ్, ఆర్ఎంవో ప్రసన్న, వకులా పాల్గ్గొన్నారు.
ఎస్పీ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన..
జిల్లా కేంద్రంలో నూతనంగా 30ఎకరాల స్థలంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని నిర్మించేందుకు పాలిటెక్నిక్ కళాశాల వెనుకవైపు, వీరన్నపేట గుట్టల వెనుక వైపు ప్రాంతాన్ని ప్రతిపాదించినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. నూతన ఎస్పీ కార్యాలయ నిర్మాణానికి బుధవారం కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహతో కలిసి ప్రభుత్వ పాలిటెక్నిక్ వెనుకవైపు ఉన్న స్థలాన్ని మంత్రి పరిశీలించారు. నూతన ఎస్పీ ఆఫీస్ను నిర్మించడం వల్ల పోలీస్ క్వార్టర్స్, పరేడ్ గ్రౌండ్లతోపాటు ఆధునాతన సౌకర్యాలు ఎస్పీ ఆఫీసుకు సమకూరుతాయన్నారు. ప్రస్తుతమున్న ఎస్పీ ఆఫీసులో డీఐజీ ఆఫీస్ కొనసాగిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, మున్సిపల్, రెవెన్యూ అధికారులున్నారు.
కార్పొరేట్ను తలదన్నేలా సర్కారు బడులు
మహబూబ్నగర్ అర్బన్, జూన్ 28 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయని, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారిపోయాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హన్వాడ మండలంలో మన ఊరు-మనబడి పథకం ద్వారా అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలను చూసి కార్పొరేట్ పాఠశాలలా ఉందంటూ అధ్యయనం కోసం వచ్చిన కేంద్ర బృందం ఆశ్చర్యపోయిందని మంత్రి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని షాషాబ్గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారత సేవాశ్రమ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. త్వరలోనే మహబూబ్నగర్లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో భారత సేవాశ్రమ సంఘం అధ్యక్షుడు మునేశ్వరనంద స్వామీజీ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్లు కట్టా రవికిషన్రెడ్డి, పాపారాయుడు, తాసీల్దార్ పార్థసారధి, హెచ్ఎం సాయిబాబా తదితరులు పాల్గ్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్గా మహబూబ్నగర్..
మహబూబ్నగర్ టౌన్, జూన్ 28 : మహబూబ్నగర్ మున్సిపాలిటీ త్వరలో కార్పొరేషన్గా మారనున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మర్లు బృందావన్కాలనీలో రూ.48.45 లక్షల వ్యయంతో నిర్మించే డ్రైనేజీ, పంచముఖికాలనీలో రూ.28.95లక్షల వ్య యంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి భూమిపూజ చేశారు.శిల్పారామం, మినీట్యాంక్బండ్ అభివృద్ది చేశామని, వండర్లా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే సౌత్కొరియాలో పర్యటించి అక్కడి ప్రత్యేతలు తెలుసుకొని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ట్యాంక్బండ్ వద్ద సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్ పతంజలి భరద్వాజను అభినందించారు. కేబుల్ బ్రిడ్జి పనులు చేస్తున్న కార్మికులతో కలిసి ఫొటో దిగారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కులమతాలకు అతీతంగా అభివృద్ధి..
కులమతాలకతీతంగా అభివృద్ధ్ది చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని వానగుట్టలోని ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు ఈద్గా సమీపంలో రూ.కోటీ అంచనా వ్య యంతో నిర్మించనున్న షాదీఖానా పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
హన్వాడ, జూన్ 28 : ప్రతి కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ బీఆర్ఎస్లో చేరగా, ఆయనకు మంత్రి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీ వడ్లశేఖర్, మండల కోఆప్షన్ మన్నాన్ పాల్గొన్నారు.