గద్వాల, జనవరి 11 : జిల్లాకేంద్రం లో నిర్మిస్తున్న 300 పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంట్రాక్టర్లు, అ ధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సంతోష్తో కలిసి దవాఖాన, మార్కెట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దవాఖానలో మౌలిక సదుపాయాలు, విద్యుత్ తదితర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పూర్తికి సీఎం రేవంత్రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మార్కెట్లో వ్యాపారులకు అవసరమైన స దుపాయాలు కల్పించి త్వరలో దుకాణాలు అంద జేస్తామన్నారు.
కూరగాయలు, నాన్వెజ్ దుకాణాలు, తదితర వాటిని ఏర్పాటు చేసుకునేందుకు ఆధునిక హంగులతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. గత అరవైఏండ్ల కాంగ్రెస్ పాలనలో గద్వాల నియోజకవర్గంలో విద్య, వైద్య సౌకర్యాలు వెనుకబడ్డాయని, దీంతో ప్రజలకు సరైన వైద్య సేవలు అందక నానా అవస్థలు పడ్డారని ఎమ్మెల్యే బండ్ల అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు నడిగడ్డపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, మున్సిపల్ చైర్మన్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, ఆర్డీవో చంద్రకళ, వైద్యాధికారులు కిశోర్కుమార్, శశికళ, మున్సిపల్ కమిషనర్ నర్సింహ, సర్పంచ్ వాసు, ఎంపీపీ విజయ్కుమార్, నాయకుడు రామన్గౌడ్ ఉన్నారు.