నాగర్కర్నూల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అన్న సమైక్యవాదుల శాపనాలకు చెంపపెట్టు లా నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యుత్ వెలుగులు నిరంతరం విరజిమ్ముతున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉచిత విద్యుత్తో ఓ వైపు సేద్యం, సబ్సిడీతో దళిత, గిరిజన, చేతివృత్తిదారులకూ విద్యుత్ అందుతోంది. దీంతో రైతన్నలతో పాటు పేదల జీవితాల్లోనూ విద్యుత్ వెలుగులు జిగేల్మంటున్నాయి.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 103 (33/11కేవీ) ఉప కేంద్రాల ద్వారా రోజూ 8.5మిలియన్ యూనిట్ల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో రూ.74కోట్లతో 2,126కిలో మీటర్ల 11కేవీ లైన్లు, రూ.79కోట్లతో ఎల్టీ లైన్లు, రూ.36కోట్లతో 71పవర్ ట్రాన్స్ఫార్మర్లు, రూ.33.23కోట్లతో 16,615డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా 1,06, 822వ్యవసాయ బావులకు ఏకంగా రూ.747కోట్లతో కనెక్షన్లు ఇవ్వడం గమనార్హం. దీనివల్ల రైతులు పగటి పూట పొ లాలకు నీళ్లు మళ్లించుకుంటూ రాత్రిళ్లు ఇండ్లల్లో హాయిగా నిద్రిస్తున్నారు. రైతులకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, లైనింగ్, స్తంభాలను రోజుల వ్యవధిలోనే బిగించేస్తున్నారు. అలాగే ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ప్రారంభించడం, మిషన్ కాకతీయ ద్వారా 2వేల చెరువులను అభివృద్ధి చేయడం కూడా కలిసొచ్చింది.
దీనివల్ల నీటి సమస్య కూడా తీరింది. ఫలితంగా వ్యవసాయం సంబురంగా సాగుతోంది. జిల్లాలోని 19,151మంది దళిత కుటుంబాలకు, 10,575గిరిజన కుటుంబాలకు లబ్ధ్ది కలుగుతోంది.అలాగే చేతివృత్తులపై ఆధారపడిన నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారులకు సైతం 250యూనిట్ల వరకు సబ్సిడీపై విద్యుత్ అందిస్తున్నారు. ఏఈలు, సబ్ ఇంజినీర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జేఎల్ఎంల నియామకాలు చేపట్టారు. ఉద్యోగులకు 2014లో 30శాతం, 2018లో 35శాతం, ఇటీవల 2022లో 7శాతం పీఆర్సీ ప్రకటించారు. జిల్లాలోని అవుట్ సోర్సింగ్ ఆర్టిజన్లు 381మంది రెగ్యులరయ్యారు. నేడు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు సంబురంగా జరుపుకోనున్నారు.
30లక్షల యూనిట్ల వినియోగం..
గద్వాల, జూన్ 4 : జిల్లాలో గతంలో రోజుకు 16లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ప్రస్తుతం ఉచిత విద్యుత్తో 30లక్షల యూనిట్లకు పెరిగింది. 2014 వరకు జిల్లాలో 34 ఉపకేంద్రాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత అదనంగా 36 ఉపకేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో దారిద్య్రరేఖ దిగువన ఉన్న 34,800 గృహాలకు సబ్సిడీపై విద్యుత్ అందిస్తున్నారు. రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత పథకం కింద 318 క్షౌర దుకాణాలకు, 444 ఇస్త్రీ దుకాణాలకు మీటర్లు ఇచ్చారు. జిల్లా కేం ద్రంలో రూ.2కోట్లతో సర్కిల్ కార్యాలయ భవనం నిర్మించారు.
విప్లవాత్మక మార్పులు
మహబూబ్నగర్, జూన్ 4 : మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయ వినియోగదారులు 33,997 ఉన్నారు. కేవలం తొమ్మిదేండ్లలో రూ.190కోట్లు ఖర్చు చేసి నూతనంగా 27,162 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా గతంలో 54 విద్యుత్ ఉపకేంద్రాలు ఉండేవి. రూ.42కోట్లు ఖర్చు చేసి మరో 25 ఉప కేంద్రాలను నిర్మించారు. 13,163 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, రూ.145కోట్లతో 9,716 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 29,314 మంది గృహ వినియోగదారులకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రూ.10.19కోట్ల సబ్సిడీ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. వీరితోపాటు రజకులు, నాయీబ్రహ్మణులకు 251 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా రూ.55లక్షల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తున్నది.