పన్ను వసూళ్లు, విద్యుత్ బకాయిల చెల్లింపులో ఆదర్శం
l3,685 మంది జనాభా.. 24 సీసీ కెమెరాలు
1400 మంది ఉపాధి కూలీలకు వంద శాతం పని దినాలు
మొక్కలు పీకితే జరిమానా, రక్షణకు ప్రత్యేకంగా వన సేవకులు
ప్రైవేటు బస్సుల కట్టడితో సర్కారు బడిలో 30 నుంచి 340కి పెరిగిన విద్యార్థుల సంఖ్య
పచ్చదనం,పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు దూరం
నిజామాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :మురికి కూపాలుగా ఉన్న పల్లెలు రూపురేఖలను మార్చుకుని కొత్తందాలను సంతరించుకుంటున్నాయి. పకడ్బందీ పారిశుద్ధ్య నిర్వహణతో స్వచ్ఛతవైపు అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నాయి. సర్కారు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకున్న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామం ప్రగతిలో దూసుకుపోతున్నది. ఊరంతా ఆహ్లాదాన్ని పంచేలా పచ్చదనం పరుచుకున్నది. ప్రతి గల్లీలో సీసీ రోడ్లను నిర్మించారు. చెత్తతో ఎరువును తయారు చేసేందుకు కంపోస్టు షెడ్డు, సకల సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మించారు. వీధుల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లతో గ్రామం వెలిగిపోతున్నది. 2019 సెప్టెంబర్ నుంచి 2021 జనవరి వరకు దూపల్లి గ్రామానికి రూ.85.90లక్షల నిధులు సమకూరడం గమనార్హం. తక్కువ కాలంలో ఆదర్శ గ్రామంగా మారిన పల్లెను చూసి కొత్త పాఠాలను నేర్చుకోవాల్సిందేనంటున్నారు అధికారులు.
పల్లె సీమల రూపురేఖలను పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తిగా మార్చేస్తున్నది. గ్రామాల్లో చేపడుతున్న పనులతో ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందుతున్నాయి. పల్లె ప్రగతికి ముందు, పల్లె ప్రగతికి తర్వాత అన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. వందకు వంద శాతం లక్ష్యం నెరవేరుతున్నది. పరిశుభ్రత, ఆరోగ్య ఆవాసాలుగా గ్రామాలు మారుతున్నాయి. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా గ్రా మాల్లో గుంతలను పూడ్చడం, పిచ్చి చెట్లను కొట్టేయడం, పాత బావులను, గుంతలను పూడ్చడంతో నీరు నిల్వ ఉండడం లేదు. దోమలు తగ్గాయి. ఈ ఏడాది డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలలేదు. పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలే కారణమని ఊరి జనం చెబుతున్నారు. జ నం మెచ్చిన మొక్కలను గ్రామ నర్సరీల్లోనే పెంచుకోవడం, హరితహారం నాటికి ఇంటింటికీ పంపిణీ చేయడం, వైకుంఠధామం, ట్రాలీ, ట్యాంకర్లతో కూ డిన ట్రాక్టర్లు సమకూర్చడం ద్వారా ఊరికి మేలు చేకూరుతున్నది. విలేజ్ కామన్ డంప్ యార్డుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించినట్లుగానే పూర్తి అవుతుండడం విశేషం.
పల్లె ప్రగతికి ముందు…
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామాన్ని ఒకప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. పంచాయతీ సెక్రటరీ కూడా లేని ఈ గ్రామంలో ప్రజలకు నిత్యం ఇబ్బందులే. రోడ్లన్నీ చెత్తాచెదారంతో కనిపించేవి. శ్మశాన వాటికకు స్థలం కరువే. పిల్లలులేక ప్రభుత్వ బడి వెలవెలబోయేది. తాగునీటికి గోస. దొంగతనాలు, చిన్నపాటి ఘర్షణలు జరిగేవి. నీటి వనరులు లేక చెరువులు బోసిపోయేవి. పాడి, పంటలకు ఇబ్బందులుండేవి. రాత్రుల్లో వీధులు చిమ్మచీకటే. వానకాలం వచ్చిందంటే దోమలతో సహవాసం. ప్రజల్లో ఐక్యత లేమి. ఊరు ఎటు పోతే మాకేందన్న అభిప్రాయం. పురుషులైనా, మహిళలైనా మరుగుదొడ్లు లేక ఊరి చివరకే పయనం.
ఇప్పుడు..
ఊరంతా పచ్చదనానికి కేరాఫ్గా మారింది. చెత్త కంటికి కనిపించదు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, రోడ్డు పక్కనే మొక్కలు. చెత్తతో ఎరువును తయారు చేసేందుకు కంపోస్టు షెడ్డు. ఊరి చివరన ఆఖరి మజిలీకి సకల సౌకర్యాలతో శ్మశాన వాటిక. చీకట్లను చీల్చుకుంటూ వీధుల్లో ఎల్ఈడీ కాంతులు. ఊర్లో ఏ చిన్న ఘటన జరిగినా చిటికెలో పట్టేసే సీసీ కెమెరాలు. అందంగా ప్రభుత్వ బడి ముస్తాబు. ఇంగ్లిష్ మీడియంతో వందలాది మంది పిల్లలకు స్థానికంగానే చదువు. మురుగు కనిపించదు. దోమలు కనుమరుగు. ఊరి బాగు కోసం ఏకమైన గ్రామ జనం. కళ్లెదుటే పంచాయతీ కార్యదర్శి. ఏ ఇబ్బందులున్నా చిటికెలో పరిష్కారం
ఎరువు తయారైంది..
జిల్లాలో 530 జీపీలుంటే అందరి కన్నా ముందే కంపోస్టు షెడ్డును పూర్తి చేసుకున్న పంచాయతీ దూపల్లి మాత్రమే. ఇప్పుడిక్కడ చేపడుతున్న చెత్త నిర్వహణ పద్ధతులు మిగిలిన పంచాయతీలకు పాఠాలుగా మారుతున్నాయి. అక్టోబర్ 2020 నుంచి ప్రారంభమైన కంపోస్టు షెడ్డు ఎరువుల తయారీ ప్రక్రియ ఫలవంతమైంది. జీపీలకు పుష్కలంగా వస్తున్న నిధులతో రూ.5.40లక్షలతో ట్రాక్టర్, రూ.1.80లక్షలతో ట్రాలీ, రూ.1.85లక్షలతో ట్యాంకర్ను సమకూర్చుకోవడంతో మొక్కలకు నీళ్లు, చెత్త సేకరణకు ఇబ్బంది తొలగింది.
పల్లె ప్రగతి వరంగా మారింది..
పల్లెలను గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టం తెచ్చింది. క్రమం తప్పకుండా పల్లె ప్రగతి కోసం నిధులను సమకూరుస్తున్నది. కరోనా కష్ట సమయంలో కూడా ఇతర ఖర్చులు తగ్గించుకుని మ రీ గ్రామ పంచాయతీలకు నిధులను అందించింది. మా ఊరికి పల్లె ప్రగతి ఓ వరం. కరెంట్ బిల్లులు కట్టేందుకు పైసల్లేకపోయేది. ఇప్పుడు ప్రతి నెలా రూ.80వేలు కట్టేస్తున్నాం.