నిత్యం శానిటేషన్
పకడ్బందీగా కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు
ఖిలావరంగల్, మార్చి 17 : చారిత్రక కట్టడాలు అపురూప జ్ఞాపకాలు.. చరిత్రను కళ్ల ముందుంచి మనసును ఉల్లాసపరిచే ఆనవాళ్లు. అందమైన ప్రకృతికి చిరునామా. అటువంటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఓరుగల్లు కోటను సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతారు. కాకతీయుల కళావైభవాన్ని మదినిండా దాచుకొని స్వస్థలాలకు తిరిగి వెళ్తుంటారు. అయితే ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటకు వచ్చే పర్యాటకులకు కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చారిత్రక కట్టడాలు ‘సేఫ్’ అని పర్యాటకులకు నమ్మకం కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
నిత్యం కరోనా
నియంత్రణ చర్యలు
చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు దూర ప్రాంతాల నుంచి కోటకు పర్యాటకులు తరలి వస్తున్నారు. కొవిడ్-19 నిబంధనల్లో భాగంగా మాస్క్, భౌతిక దూరం పాటించే పర్యాటకులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అలాగే పర్యాటకుల సందడి కనిపించే కీర్తి తోరణాల ప్రాంగణం, ఖుష్మహల్, శృంగారం బావి, ఏకశిలగుట్ట తదితర చారిత్రక కట్టడాలను నిత్యం శుభ్రం చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేంద్ర పురావస్తు శాఖ సిబ్బంది కొవిడ్-19 నివారణ చర్యలు చేపడుతున్నారు. ఆ శాఖ సూపరింటెండెంట్ స్మితా ఎస్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అధికారి మడిపల్లి మల్లేశం స్వీయ పర్యవేక్షణలో నిత్యం మూడు సార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ప్రతి శిల్పాన్ని రసాయన ద్రావణాలతో శుభ్రం చేస్తున్నారు. పర్యాటకులు ప్రతి శిల్పాన్ని చేతులతో స్పృశించి సెల్ఫీలు తీసుకొని సంబురపడుతారు. ఈ సందర్భంగా కరోనా బారిన పడకుండా కేంద్ర పురావస్తు శాఖ తీసుకుంటున్న చర్యలను చూసి పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.