మహబూబ్ నగర్ : జిల్లాలోని చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో కాకతీయుల కాలం నాటి చెన్నకేశవ స్వామి విగ్రహం బయటపడింది. గ్రామానికి పశ్చిమ దిశలో ఉన్న ఊక చెట్టు వాగు మీద చెక్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఇసుకను తొలగిస్తుండగా ముందు నల్ల మొద్దు కొయ్యలు కనిపించాయని, వాటిని తొలగించగా నల్ల శాసనపు రాతి విగ్రహం బయట పడిందని స్థానికులు తెలిపారు. వెంటనే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో పురావస్తు పరిశోధకుడు శివనాగి రెడ్డికి ఎమ్మెల్యే విగ్రహం లభించిన సమాచారాన్ని తెలిపారు.
నాలుగు అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంగల చెన్నకేశవ విగ్రహం అన్ని ఆభరణాలతో రెండు చేతుల్లో శంఖ చక్రాలు, ఒక చేతిలో పద్మం, మరో చేతిలో గధ ధరించి ఉందని.. అటూ ఇటూ పరిచారికలు కలిగి ఉందని.. ప్రతిమ లక్షణాలను బట్టి ఈ విగ్రహం కాకతీయుల కాలానికి చెందిందని శివనాగిరెడ్డి తెలిపారు. కాకతీయులలో చివరి పాలకుడైన ప్రతాప రుద్రుడి బందీగా ఢిల్లీ సుల్తానులు తీసుకెళ్లిన సందర్భంగా స్థానికులు ఈ విగ్రహాన్ని భూమికి 15 అడుగుల లోతులో భద్రపరచారని ఆయన అన్నారు. అపురూపమైన ఈ విగ్రహానికి ఆలయం నిర్మించే విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. వాగులో బయటపడ్డ విగ్రహానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.