ఆ ఊళ్లో పొలంలో సేద్యం చేయాలన్నా.. దుక్కి దున్నాలన్నా.. విత్తనాలు వేయాలన్నా.. రైతులందరూ ఏకతాటిపై నిలబడి చేస్తారు. ఎక్కడైనా వారసత్వంగా వచ్చిన భూములను పంపకాలు చేసుకుంటారు.. కానీ అయిజ మండలం ఈడిగోనిపల్లి గ్రామంలో మాత్రం86 ఎకరాలను 120 మంది రైతులు కలిసికట్టుగా సాగు చేస్తున్నారు. ఇందులో కొంత భూమిని పశుగ్రాసం నిల్వ చేసేందుకు, ఇతర అవసరాలకు వేరు చేసి గ్రామ కంఠంగా మార్చారు. మిగితాది 65 మంది రైతుల పేరిట ఆర్వోఆర్లో నమోదు చేయించారు. కనీసం ఎవరి హద్దులు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. 52 ఏండ్లుగా ఆ గ్రామంలో ఇదే సంస్కృతి.. నాటి నుంచి నేటి వరకు అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉంటూ ఉమ్మడి సేద్యం చేస్తున్నారు. అందుకే తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేసి సిరుల పంటలు పండిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అయిజ రూరల్, మార్చి 21 : తల్లిదండ్రుల వద్ద నుంచి సంక్రమించిన భూమిని ఆ కుటుంబానికి చెం దిన వ్యక్తులు భాగాలు పంచుకొని సేద్యం చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇందుకు భిన్నంగా ఒక గ్రా మానికి చెందిన వ్యక్తులు ఉమ్మడిగా సాగు చేయడం ఎ క్కడా విని ఉండం. అయిజ మండలం ఈడిగోనిపల్లి గ్రామంలో 86 ఎకరాలను 120 మంది రైతులు కలిసికట్టుగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దుక్కి దున్నాలన్నా.., విత్తనం వేయాలన్నా.., అంతర సే ద్యం చేయాలన్నా 65 జతల కాడెద్దులు పొలంలోకి వె ళ్లాల్సిందే. గ్రామంలోని ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున పొలం పనులకు వెళ్తారు. గతంలో మజరా గ్రామంగా ఉన్న ఈడిగోనిపల్లి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది.
1970 సెప్టెంబర్ 18న గద్వాల దొరలకు చెందిన ఉత్తనూరు శివారులోని 86 ఎకరాలను ఈడిగోనిపల్లి గ్రామానికి చెందిన బడేసాబ్, చిలుకల తిప్పన్న, తాటికుంట హుస్సేని, బోయ హనుమక్క, ఒదురు తిప్పన్న, నక్కల బజారి, నాగప్ప కలిసి రూ.65వేలకు కొనుగోలు చేశారు. పశుగ్రాసం నిల్వ చేసేందుకు తదితర అవసరాల నిమిత్తం కొంతభూమిని వేరుచేసి గ్రామ కంఠంగా మార్చుకొని వాడుకుంటున్నారు. మిగిలిన భూమిని గ్రామానికి చెందిన 65 మంది రైతుల పేరిట ఆర్వోఆర్లో నమోదు చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి ఎవరి హద్దులు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ఉంటూ ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో పప్పుశనగ, జొన్న, కుసుమ పంటలతోపాటు కళంగిరి, కర్బూజ పండ్ల తోటలను కూడా సాగు చేస్తుంటారు.
తగ్గిన ఖర్చులు.. పెరిగిన లాభాలు..
ఉమ్మడి సేద్యం చేయడంవల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గి అధిక లాభాలు పొందుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పొలంలో ఏ పనులు చేయాలన్నా.. తెలియజేసేందుకు గతంలో దండోరా వేయించేవారు. ప్రస్తుతం గ్రామంలోని శివరామాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న మైకు ద్వారా సమాచారం చేరవేస్తున్నారు. రెండు రోజుల ముందే ఆలయ ప్రాంగణంలో రైతులందరూ సమావేశమై అవసరమైన విత్తనాలను సమకూర్చుకుంటారు. పంటకు సంబంధించిన ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేసేందుకు ప్రతి రైతూ.. వారికి కేటాయించిన వాటాను జమచేసి ఒకరి వద్ద ఉంచుతారు. పంట చేతికొచ్చిన తర్వాత అందరూ కలిసి పంటను అక్కడే నూర్పిడి చేస్తారు. అనంతరం ఎవరి వాటాను వాళ్లు వేరుచేసి ఇండ్లకు తీసుకెళ్తారు. ఒక్కోసారి పండ్ల తోటలు సాగుచేసేందుకు వ్యాపారస్తులకు భూమిని కౌలుకు ఇస్తారు. వచ్చిన డబ్బును అందరూ సమానంగా తీసుకుంటారు.
ఉమ్మడి సేద్యంతో సంతోషం..
మా గ్రామానికి చెందిన రైతులందరం ఉమ్మడి సేద్యం చేస్తున్నాం. ఇది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరికి వారు వ్యవసాయం చేస్తే పెద్దగా ఆదాయం ఉండదు. కలిసికట్టుగా సాగు చేస్తే తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభం చేకూరుతుంది. సాగు చేయాలంటే గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఇద్దరి చొప్పున పొలం పనులకు వస్తారు. వచ్చే తరానికి కూడా ఇదే విధంగా ఉండాలని చెబుతాం.
– గొల్ల నడిపెన్న, రైతు, ఈడిగోనిపల్లి
భూమి పంచుకోవాలని లేదు..
52 ఏండ్లుగా మా గ్రామంలో ఉమ్మడి వ్యవసాయం చే స్తున్నాం. భూమిని పంచుకోవాలన్న ఆలోచన ఇంతవరకు ఏ రైతుకూ రాలేదు. ఎవరి హద్దులు ఎక్కడున్నాయో కూ డా మాకు తెలియదు. అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉంటూ ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నాం. ఇలానే అందరం కలిసి ఉండాలని ఉంది. ఉమ్మడి పొలంలోకి
65 కుటుంబాల వారు 65 జతల కాడెద్దులతో వచ్చి వ్యవసాయం చేయడం అద్భుతం.
– కుర్వ ఈరన్న, రైతు, ఈడిగోనిపల్లి