ఆత్మకూరు, సెప్టెంబర్ 26: రాష్ట్ర విద్యుత్ చరిత్రలో జలవిద్యుత్ది ప్రత్యేక స్థానం. తెలంగాణ ఆవిర్భావం జరిగితే రాష్ట్రం చిమ్మచీకట్లలో మగ్గుతుందని భయపెట్టిన ఆంధ్రా పాలకుల నోళ్లకు తాళం వేసింది జలవిద్యుత్. కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియడం కంటే ఎప్పుడు పోతుందో చెప్పడం సుళువన్న మాటలను తిప్పికొట్టిన ఘనత జలవిద్యుత్దే. కర్షకులకు, మరెన్నో రంగాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ రాష్ట్ర విద్యుత్ వినియోగంలో తనవంతు వాటాను నిల్పుకున్న రంగం జలవిద్యుత్తుది.. జలవిద్యుత్ రంగంలో రాష్ర్టానికి అందేవేసిన చెయ్యిగా విద్యుదుత్పత్తిని అందిస్తూ విద్యుత్ చరిత్రలో ‘పవర్’ చాటుకుంటున్నాయి రాష్ట్ర హైడల్ జల విద్యుత్ ప్రాజెక్టులు.
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు చీకటి రోజులు పారదోలడంలో ప్రముఖంగా రాష్ట్ర విద్యుత్ వినియోగానికి జలవిద్యుత్ ఎంతో తోడ్పాటునందించింది. పగలు, రాత్రి తేడా లేకుండా కరెంట్ కష్టాలను ఎదుర్కొన్న తెలంగాణ ప్రజలకు కరెంట్ పోవడమే గగనస్థితిగా తెచ్చిన ఘనత జలవిద్యుదుత్పత్తి నిలుపుకున్నది. ఇంతటి ఘనచరిత్రకు తార్కాణంగా నిలిచే జలవిద్యుత్ ప్రాజెక్టులు రాష్ర్టానికి వెలుగులు పంచే హైడల్ ఖిల్లాలుగా మారాయి.
జలవిద్యుత్కు ఆదరణ
జలవిద్యుదుత్పత్తిలో ఆయా ప్రాజెక్టులు తమవంతుగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ర్టానికి అవసరమయ్యే విద్యుత్ ఉపయోగంలో థర్మల్తో పాటు హైడల్ ప్రాజెక్టులు భాగం పంచుకుంటున్నాయి. రాష్ట్ర వినియోగంలో దాదాపు సగం వరకు జలవిద్యుత్తోనే అవసరాలు తీర్చుకోగలుగుతున్నాం. ఈ ఘనత తెలంగాణ పాలకులకే దక్కుతుందన్నది నగ్నసత్యం. గతంలో ఉన్న కొద్ది ప్రాజెక్టుల్లో అధికంగా పేర్లు వినబడేవి శ్రీశైలం, నాగార్జున్సాగర్ మాత్రమే. స్వరాష్ట్రంలో నిలిచిపోయిన పనులను వేగిరం చేసి విద్యుత్ ప్రాజెక్టులను వినియోగంలోకి తెచ్చి, జలవిద్యుత్ ప్రాజెక్టులను వినియోగంలోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతున్నది. జెన్కో సంస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకొచ్చి రాష్ర్టానికి వెలుగులు ప్రసరింపజేస్తున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సీఎండీ ప్రభాకర్రావు నేతృత్వంలో జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు పునర్జీవం దక్కింది. నత్తనడకన మూలుగుతున్న పలు ప్రాజెక్టుల పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేసి రాష్ట్ర ప్రగతికి కాంతిని అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వరదనీరు వస్తే ప్రాజెక్టుల గేట్లెత్తి దిగువకు వదిలేవారు. ఇప్పుడు వరద వస్తుందంటేనే ప్రణాళికాబద్ధంగా విద్యుత్ కేంద్రాలు ఉన్న ప్రాజెక్టుల వద్ద విద్యుదుత్పత్తి ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఒక్క బొట్టు వృథా చేయకుండా విద్యుదుత్పత్తిని నిర్వహిస్తూ, సాగునీటికి వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాలన్నీ నీటిలభ్యత ఉన్నన్ని రోజులు నిర్విరామంగా విద్యుదుత్పత్తిని నిర్వహిస్తున్నాయి.
జిల్లాకే వన్నెతెచ్చిన విద్యుత్ కేంద్రాలు
ఉమ్మడి జిల్లాకే జూరాల జలవిద్యుత్ కేంద్రాలు వన్నె తీసుకొచ్చాయి. ఎగువ జూరాల, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలు వరదలు ప్రారంభమైన నాటి నుంచి నిర్విరామంగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ రాష్ట్రవాటాలో తమవంతు పాత్రను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే రెండు విద్యుత్ కేంద్రాల్లో మొత్తంగా 400మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మార్కును అధిగమించి లక్ష్యం దిశగా పరిగెడుతున్నాయి. గతేడాది ఈ ప్రాజెక్టుల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఉత్పత్తిలో రికార్డు సృష్టించాయి. ఎగువ జూరాలలో 370మి.యూ, దిగువ జూరాలలో 403 మి.యూ విద్యుదుత్పత్తి జరిగింది. ఈ ఏడాది ఉన్నతాధికారులు ఎగువలో 354మి.యూ, దిగువలో 380మి.యూ ఉత్పత్తి లక్ష్యాన్ని విధించారు. ఇప్పటికే ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 205మి.యూ ఉత్పత్తి జరుగగా, దిగువ జూరాల జలవిద్యుత్ ప్రాజెక్టులో 227మి.యూ ఉత్పత్తి జరిగింది. మరో రెండేళ్లు వరదలు కొనసాగితే గత రికార్డులను అధిగమించి జలవిద్యుత్ చరిత్రలో జిల్లా ప్రాజెక్టులు చరిత్ర సృష్టిస్తాయి. ఈ ఏడాది ఏరువాక కంటే ముందే ఏరు వచ్చిన క్రమంలో నెలరోజుల ముందే జూన్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైనది. జలవిద్యుత్ ప్రాజెక్టుల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూన్ నెలలోనే రికార్డుస్థాయి ఉత్పత్తి జరిగింది. జూన్లోనే దాదాపు 50మి.యూ ఉత్పత్తి జరిగింది.
నాలుగోవంతు ఇస్తున్నాం
రాష్ట్ర విద్యుత్ అవసరాలకు నాలుగోవంతు విద్యుత్ను హైడల్ ప్రాజెక్టుల నుంచి ఇస్తున్నాం. దాదాపు వెయ్యికిపైగా మెగావాట్లు రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అందిస్తున్నాం. సీజన్లో ఇది రెట్టింపులో ఉంటుంది. శ్రీశైలం, నాగార్జున్సాగర్ నుంచే అధిక ఉత్పత్తి జరుగుతుంది. బొగ్గుతో పోల్చితే జలవిద్యుదుత్పత్తికి ఖర్చు తక్కువ. తక్కువ ఖర్చుతోపాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ప్రకృతిని సంరక్షిస్తూ హైడల్ విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.
జలవిద్యుత్కే ప్రాధాన్యం
వానలు, వరదలు వచ్చే సీజన్లో జలవిద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఉంటుంది. సాధ్యమైనంతగా జలవిద్యుత్ ద్వారానే విద్యుత్ అవసరాలను తీర్చుకుంటాం. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తిరిగి ప్రాజెక్టులకే మళ్లించడంతో ప్రాజెక్టు నీటిమట్టం తగ్గదు. ఇక్కడ అన్ని వేళల్లోనూ విద్యుదుత్పత్తిని నిర్వహించవచ్చు. ఇతర ప్రాజెక్టుల్లో వరద ప్రవాహంపై విద్యుదుత్పత్తి నిర్వహించేవి కాబట్టి కేవలం సీజన్లోనే ఉత్పత్తి నిర్వహించగలం. ఇప్పటికైతే ఎగువ, దిగువ ప్రాజెక్టులు సంతృప్తికరంగానే నిర్వహిస్తున్నాం. ఎగువ జూరాలలో 5వ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానున్నది. వరుణుడి కృపతో ఎగువనుంచి వచ్చే వరద లభ్యతను బట్టి జరిగే ఉత్పత్తి అధారంగా లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషిచేస్తాం.