కోయిలకొండ, డిసెంబర్ 20: సహకార సంఘం బ్యాంకు లో తీసుకున్న రుణాలు చెల్లించేందుకు వన్టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాలని సహకార సంఘం ఉమ్మడి జిల్లా సీఈవో లక్ష్మయ్య తెలిపారు. మంగళవారం మండలంలోని గార్లపాడ్ సింగిల్విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడారు. రైతులు ఏకకాల రుణం చెల్లిస్తే వారికి వెంటనే రుణం అందించి ప్రోత్సహిస్తామని వెల్లడించారు. దీంతోపాటు సహకార బ్యాంకు ద్వారా రైతులకు రూ.10లక్షల వరకు గృహనిర్మాణానికి, రూ.20లక్షల వరకు రైతు బిడ్డల విదేశీ చదువులకు రుణాలు అందిస్తామని తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకు ద్వారా మరింత సహకారం పొందాలని పిలుపునిచ్చారు. గార్లపాడ్ సింగిల్విండోలో ఏకకాల రుణ పరిష్కారం చేసుకున్న రైతులను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మేనేజర్ భారతి, సూపర్వైజర్ ప్రదీప్, డైరెక్టర్లు శ్రీపాదపావు, ఆశన్నగౌడ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.